పవన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తారా: ఒక్క ఛాన్స్ అంటూ దోచేస్తున్నారు: దీక్షలో చంద్రబాబు ఫైర్!
టీడీపీ అధినేత...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నాచౌక్లో దీక్ష ప్రారంభించారు. ఏపీలో ఇసుక కొరతకు కారణం ప్రభుత్వమని ఆరోపించారు. ఇదే సమస్య మీద లాంగ్ మార్చ్ చేసిన జనసేన అధినేత మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని చంద్రబాబు నిలదీసారు. అదే విధంగా మీ మీద వ్యక్తిగత విమర్శలు మొదలు పెడితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరణ శాసనం రాస్తున్నారని దుయ్యబట్టారు. తొలి రోజు నుండే కూల్చివేతలతో పాలన ప్రారంభించారని ఫైర్ అయ్యారు. సమస్య పరిష్కరించటం చేతకాకపోతే దద్దమలని ఒప్పు కోవాలని డిమాండ్ చేసారు. సీఎం జగన్ కు డబ్బంతా తన దగ్గరే ఉండాలని..ఎన్నికల్లో దానిని వినియోగించాలనేది ఆలోచన అంటూ ఆరోపించారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!
మేము వ్యక్తిగతంగా మాట్లాడితే..
ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 12 గంటల దీక్ష ప్రారంభించారు. తన దీక్షకు గల కారణాలను చంద్రబాబు వివరించారు. సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని మండిపడ్డారు. ఇసుక సమస్య మీద జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా మీ పైన విమర్శలు చేస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పును ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు..ఎమ్మెల్యేలు ఇస్టానుసారం ఇసుక ను దోచుకుంటున్నారని..ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఎవరు చెప్పినా వినరని..అర్దం చేసుకోరని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆబోతుల్లా వ్యవహరిస్తున్నారని.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి దోచుకుంటున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
డబ్బంతా జగన్ దగ్గరే ఉండాలి..ఎన్నికల్లో అదే..
జగన్ తనకు తాను డిక్టేటర్ అనుకుంటున్నారని విమర్శించారు. టెర్రరిస్టుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డబ్బంతా ముఖ్యమంత్రి తన వద్దే ఉండాలని అనుకుంటున్నారని.. ఆ డబ్బు తోనే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో ఉన్నారని దుయ్యబట్టారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరాం అంటూ నిలదీశారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని వ్యాఖ్యానించారు. దాదాపు 35లక్షల మంది పూట తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు.
ఉచిత ఇసుక..25 లక్షల పరిహారం..
ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక పాలసీని ప్రకటించాలని..ఇప్పటి సమస్యకు అదే పరిష్కారమని చంద్రబాబు డిమాండ్ చేసారు. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు రూ 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సూచించారు.తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే... కాలం చెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా.. అని ప్రశ్నించారు. తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవ్వరూ నష్టపోలేదన్నారు. సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలనటం అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెపాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. అన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నా..ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.