బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
విజయవాడ: రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ షాక్ నుంచి తేరుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైంది. రాష్ట్ర రాజకీయాలపై తెలుగుదేశం పట్టు కోల్పోయిందనడానికి ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల గుర్తు రహితంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో 20 శాతం మేర కూడా పంచాయతీలను గెలుచుకోలేకపోయింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనే మెజారిటీ పంచాయతీలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోల్పోవాల్సి వచ్చింది.
పంచాయతీల్లో పరాజయానికి ప్రతీకారంగా..
ఈ పరిస్థితుల మధ్య పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. పార్టీ గుర్తుల మీద నిర్వహించే ఎన్నికలు కావడం వల్ల గెలిచిన అభ్యర్థి.. ఏ పార్టీకి చెందిన నాయకుడనేది తేలిపోతుంది. అందుకే- టీడీపీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదల ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార బరిలో ఏకంగా చంద్రబాబే దిగారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
బెజవాడ నేతలతో కలిసి..
కొద్దిసేపటి కిందటూ చంద్రబాబు విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని షహీద్ దర్గా వద్ద ఆయన ర్యాలీని చేపట్టారు. ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా తరలి వెళ్లారు. చంద్రబాబుకు కుడిఎడమల్లో సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. మరో వంక మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత నిల్చున్నారు. జలీల్ ఖాన్, ఇతర పార్టీ నాయకులు ఆయనతో పాటు ప్రచార వాహనంపై ఉన్నారు. స్వయంగా అధినేతే ప్రచారంలో పాల్గొనడంతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ప్రచారానికి తరలివచ్చారు. చంద్రబాబును కలిశారు.
కేశినేనిపై తిరుగుబాటు..
చంద్రబాబు రావడానికి ఒక్కరోజు ముందు విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఎన్ని విభేదాలు తలెత్తాయో తెలిసిన విషయమే. స్థానిక లోక్సభ సభ్యుడు కేశినేని నానిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు లేవనెత్తారు. బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, నాగుల్ మిరా.. కేశినేని ఆధిపత్యంపై నిప్పులు చెరిగారు. తమకు చంద్రబాబు ఒక్కడే అధినేతంటూ నినదించారు. ఎవరికీ తాము బానిసలం కాదంటూ పరోక్షంగా కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. తన కుమార్తె శ్వేత పేరును మేయర్ అభ్యర్థిత్వానికి ఖరారు చేయించుకోవడమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యమే.
విభేదాలు సమసిపోయినట్టేనా?
చంద్రబాబు పర్యటనకు ముందే రచ్చకెక్కిన విభేదాలు.. ప్రస్తుతానికి సమసిపోయినట్టుగానే కనిపిస్తోన్నాయనేది పార్టీ నేతల అంచనా. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయడం కోసమైనా కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారని వారు చెబుతోన్నారు. ఈ ఐక్యత పోలింగ్ బూత్ల వద్ద పనిచేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విభేదాలను పక్కనపెట్టి.. బుద్ధా వెంకన్న గానీ, బోండా ఉమామహేశ్వర రావు వర్గం గానీ.. తాము ప్రథమ శతృవుగా భావించే కేశినేని నాని కుటుంబం కోసం కలిసి కట్టుగా నడుస్తారా? అనేది ఉత్కంఠతను రేపుతోంది.