ఏపీ డీజీపీకి చంద్రబాబు మరో లేఖ: ఉన్నత స్థాయి విచారణకు: కాల్ లిస్ట్ ఆధారంగా: మంత్రిపై
అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్య ఘటన రాజకీయాల్లో కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్య నియంత్రణ చర్యలను తప్పు పట్టిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించినందున అధికార పార్టీ నాయకులు తనపై దాడులు చేస్తారనే భయంతో ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ నిలదీస్తున్నారు.
అమరావతి దీక్షల బాధ్యత ఇక రాష్ట్ర ప్రజలదే: జగన్ సర్కార్ అరుదైనదిగా: తేల్చి చెప్పిన చంద్రబాబు
ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలంటూ ఆయన రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగించాలని, అప్పుడే అసలు దోషులు బయటపడతారనీ అన్నారు. రాష్ట్రంలో దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పారు.
పుంగనూరు ఎమ్మెల్యే, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సహా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓం ప్రతాప్ను ఫోన్ చేసి బెదిరించినట్లు తనకు సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. వారి గుట్టును రట్టు చేయడానికి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని డీజీపీకీ సూచించారు. ఓ ప్రతాప్ ఆత్మహత్య ఉదంతంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని తాను భావిస్తున్నానని, అందుకే ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, విచారణ నిర్వహంచాలని డిమాండ్ చేశారు. ఓ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకునేలా బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని చంద్రబాబు విమర్శించారు. శిరోముండనం ఘటన మరువకముందే వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అందుకే ఈ అనర్థాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
Recommended Video
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని బండకాడ పల్లికి చెందిన ఓం ప్రతాప్.. మదనపల్లిలో కారు డ్రైవర్గా పని చేస్తుండేవారు. మద్య నియంత్రణ చర్యల్లో భాగంగా వాటి ధరలు పెంచినందుకు ఆయన ప్రభుత్వాన్ని దూషించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురి చేస్తుందనే భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గానీ, ఇతర నాయకులు గానీ తమను ఎవరూ బెదిరించలేదని ఓం ప్రతాప్ కుటుంబ సభ్యులు, బంధువులు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.