గన్నవరంలో వంశీ వారసుడు దొరికినట్లేనా ? బాబు మనసులో ఏముంది ?
గన్నవరంలో అసమ్మతి ఎమ్మెల్యే వంశీ స్ధానంలో త్వరలో కొత్త ఇన్ ఛార్జ్ ను ప్రకటించనున్న చంద్రబాబు
గన్నవరంలో వంశీ వారసుడి కోసం అన్వేషణ
గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక కృష్ణాజిల్లాలోని కీలకమైన గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేనిపై కేసులను ప్రభుత్వం తిరగదోడింది. అధికారం కోల్పోవడం, కేసుల బెడదతో వంశీ టీడీపీని వీడి వైసీపీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే వైసీపీలో చేరాలంటే పార్టీకి రాజీనామా చేసి రావాలన్న జగన్ సిద్ధాంతం మేరకు ఆయన ముందడుగు వేయలేకపోయారు. అయితే టీడీపీకి మాత్రం దూరమయ్యారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో దాదాపు వైసీపీ ఎమ్మెల్యేగా వంశీ కొనసాగుతున్నారు. అయితే వంశీ వంటి ఛరిష్మా ఉన్న నేత స్ధానంలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో టీడీపీలో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది.
వంశీ స్ధానంలో వచ్చేదెవరు ?
గన్నవరంలో వరుస విజయాలతో పాటు స్ధానికంగా కూడా ఛరిష్మా ఉన్న నేతగా పేరొందిన వంశీని ఎదుర్కొనేందుకు అంగబలం, అర్దబలం ఉన్న నేతల కోసం టీడీపీ అన్వేషించింది. రేసులో మాజీ జడ్పీ ఛైర్మన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలించింది. కృష్ణాజిల్లాలో కమ్మ సామాజికవర్గ ఆధిపత్యం ఉన్నా గ్రూపులు మాత్రం చాలానే ఉన్నాయి. దీంతో గన్నవరం ఇన్ ఛార్జ్ విషయంలో కొన్ని నెలలుగా తీవ్ర తర్జన భర్జన పడుతున్న టీడీపీ అధినాయకత్వం చివరికి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Recommended Video
అర్జునుడికే ఎందుకు
ఆరేళ్లుగా కృష్ణా జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ గ్రూపు తగాదాలను సమన్వయం చేస్తున్న అర్జునుడికి అవకాశం ఇవ్వడం ద్వారా అటు కమ్మ సామాజికవర్గంతో పాటు ఎస్సీల ఓట్లను కూడా రాబట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గన్నవరంలో కేవలం కమ్మ ఓట్లు నమ్ముకుంటే ప్రస్తుత పరిస్ధితుల్లో లాభం లేదని భావిస్తున్న చంద్రబాబు, ఇతర సామాజికవర్గాలకు అవకాశం ఇస్తే సామాజిక న్యాయం వాదనను కూడా తెరపైకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమీకరణం స్ధానికంగానూ వర్కవుట్ అవుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అర్జునుడికి అవకాశం కల్పించడం ద్వారా సరిగ్గా ఇదే పరిస్ధితి ఎదుర్కొంటున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ నేత వెళ్లిపోగానే ఇన్ ఛార్జ్ ను ప్రకటించి గన్నవరంలో తన కులానికి చెందిన వారికి ప్రత్యామ్నాయం చూడలేదన్న విమర్శలకూ చంద్రబాబు చెక్ పెట్టినట్లవుతుంది.