Telugu Desam Party: కృష్ణాపై టీడీపీ పట్టుకోల్పోతోందా? వల్లభనేని వంశీ బాటలో మాజీ ఎమ్మెల్యే?
విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ క్రమంగా పట్టు కోల్పోతోందా? తన పదవికి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే ప్రయాణించనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది జిల్లా రాజకీయాల్లో. ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడు? ఎవరు? పార్టీని వీడి వెళ్తారోననే ఆందోళన తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల్లో వ్యక్తమౌతోందని చెబుతున్నారు.
వంశీకి ఆప్తుడిగా..
వల్లభనేని వంశీ తరహాలోనే పార్టీ నుంచి బయటికి రావాలని మరో మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయనే- బోడె ప్రసాద్. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి, తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కే పార్థసారథి చేతిలో ఓటమి చవి చూశారు. 2014లో ఆయన ఇదే స్థానం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే వల్లభనేని వంశీకి ఆప్తుడిగా ముద్ర ఉంది.
Amaravati: అమరావతి నిర్మాణంపై పార్లమెంట్ లో గొంతెత్తనున్న టీడీపీ: నోటీసు ఇచ్చిన కనకమేడల!
వంశీ రాజీనామా ప్రభావం..
పార్టీ నాయకత్వం పట్ల బోడె ప్రసాద్ పెద్దగా విముఖత లేనప్పటికీ.. ఆయనపై వల్లభనేని వంశీ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత, అంతకుముందు కూడా వంశీకి పార్టీలో అంతర్గతంగా ఎదురైన కొన్ని అవమానకర సందర్భాలు, పట్టాల పంపిణీ వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలు.. ఇవన్నీ దగ్గరుండి చూసిన నాయకుడు కావడం వల్ల వంశీపై సానుభూతి ఏర్పడిందని అంటున్నారు.
వంశీ-రాజేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ లో పేరు బయటికి రావడంతో..
వల్లభనేని వంశీ రాజీనామా చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మధ్య కొనసాగిన ఆరోపణలు, ప్రత్యారోపణల ఎపిసోడ్ లో బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన పెద్దగా స్పందించలేదు. దీనిపై పార్టీ అగ్ర నాయకత్వం ఆయనపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వల్లభనేని వంశీని విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టమని పార్టీ అగ్ర నాయకత్వం సూచించినప్పటికీ.. ఆయన దానికి ససేమిరా అన్నారట.
రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా..
వల్లభనేని వంశీ-రాజేంద్రప్రసాద్ తో మీడియా ముఖంగా చోటు చేసుకున్న వాగ్వివాదం నేపథ్యంలో బోడె ప్రసాద్ నోరు విప్పకపోవడం, అదే సమయంలో వల్లభనేని వంశీపై కఠిన పదజాలంతో ఎదురు దాడికి దిగాలంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విస్పష్ట ఆదేశాలు అందినప్పటికీ.. స్పందించలేదని చెబుతున్నారు. వంశీతో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనపై విమర్శలు చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. దీనిపై పార్టీ జిల్లా నాయకులు సైతం గుర్రుగా ఉంటున్నారని సమాచారం.
Recommended Video
పార్టీలో తన వ్యతిరేకులను రెచ్చగొట్టే పనిలో..
జిల్లా రాజకీయాల్లో తన వ్యతిరేకులను రెచ్చగొట్టే పనిలో నాయకులు ఉన్నారనే విషయం బోడె ప్రసాద్ దృష్టికి వచ్చిందని అంటున్నారు. వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోవడంతో ఇక తనకు అండగా ఉండే నాయకులు ఎవరూ లేరని ఆయన ఓ స్థిర నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. వల్లభనేని రాజీనామా అనంతరం జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు తనకు వ్యతిరేకంగా మారాయనే విషయాన్ని తెలుసుకోవడం వల్లే ఇక పార్టీలో కొనసాగకూడదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.