TDP: మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గృహ నిర్బంధం: పోలీసుల బూట్లు తుడిచి..నిరసన
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. 22వ రోజుకు చేరుకున్నాయి. ఏకధాటిగా ఆందోళనలను నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడంతో రైతులు తమ నిరసనలను ఉధృతం చేశారు. బుధవారం జాతీయ రహదారి దిగ్బంధానికి దిగారు.
టీడీపీ నేతల గృహ నిర్బంధం..
తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా- రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించడానికి సిద్ధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను నిర్బంధించారు పోలీసులు. వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. గడప దాటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితిని కల్పించారు. ఆయా నాయకులు నివాసాలు, పార్టీ కార్యాలయాల్లో వారిని నిర్బంధించారు. పోలీసులను మోహరింపజేశారు.
గల్లా జయదేవ్ సహా..
గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ సహా మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమా మహేశ్వర రావు, విశాఖపట్నంలో అయ్యన్నపాత్రుడు, పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు, సహా పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. సాయంత్రం వరకూ వారిని గృహ నిర్బంధంలోనే ఉంచనున్నారు. పరిస్థితులు శాంతించిన తరువాతే వారిని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
బూట్లు తుడిచిన బోడె ప్రసాద్..
కాగా- తనను గృహ నిర్బంధంలో ఉంచడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల బూట్లను తుడిచి నిరసన వ్యక్తం చేశారు. బ్రష్ తో వారి బూట్లను శుభ్రం చేయడానికి సిద్ధపడగా.. వద్దంటూ కానిస్టేబుళ్లు వారించారు. పక్కకు తప్పుకొన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.