ఏడాదే డెడ్ లైన్: విజయసాయికి వెన్నులో వణుకు, బుద్దా వెంకన్న ధ్వజం
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీపై విమర్శలు చేశారు. అక్రమాస్తుల కేసు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక నేరాల కేసుల విచారణను ఏడాదిలోపే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందని తెలిపారు. దీంతో విజయసాయిరెడ్డి వెన్నులో వణుకు మొదలై ఉంటుందని చెప్పారు. అందుకోసమే వారు జ్యుడిషీయరీపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వారి వాదనలో పసలేదు అని.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
అక్రమాస్తుల కేసులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సూట్ కేసు కంపెనీల సూత్రధారి విజయసాయిరెడ్డి కాదా అని బుద్దా వెంకన్న అన్నారు. క్విడ్ ప్రోకో చేసింది ఎవరూ.. పాత్రధారి, సూత్రధారి అందరికీ తెలుసు అని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయిరెడ్డి, సీఎం జగన్ న్యాయవ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Recommended Video
లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకి భంగం కలుగుతుందని అనుకున్నది ఎవరూ అని బుద్దా వెంకన్న నిలదీశారు. కేసు వివరాలు మీడియాలో ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను జగన్, విజయసాయి కోరలేదా అని ప్రశ్నించారు. కానీ ఇవాళ పత్రికాస్వేచ్ఛ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా అనిపిస్తుందని తెలిపారు. మీడియా గొంతును నొక్కుతూ సీఎం జగన్ జీవో తీసుకొచ్చారని తెలిపారు.