అసెంబ్లీ రద్దుకు జగన్ ప్లాన్ ? సుప్రీం తీర్పుతో యూటర్న్ - దేవినేని ఉమ షాకింగ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మరో వార్ మొదలైంది. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ చేస్తున్న హంగామాపై ఇప్పటికే మండిపడుతున్న విపక్ష టీడీపీ ఇవాళ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు అసెంబ్లీ రద్దుకు సిద్ధమైన జగన్ తీర్పు వచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకున్నారంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు తర్వాత ఇరుకున పడిన సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్దితుల్లో అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారంటూ దేవినేని ఉమ ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మంత్రులు, కీలక నేతలతో భేటీ తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకుని ఎన్నికలకు సహకరిస్తామని తన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించారని ఉమ వెల్లడించారు. దీంతో ఆ భేటీలో ఏం జరిగిందో చెప్పాలంటూ జగన్ను దేవినేని ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికలకు వెళ్లకుండా అసెంబ్లీ రద్దుకు ప్రయత్నిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న పీకే టీమ్, ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో సీఎం జగన్ వెనక్కి తగ్గారని ఉమ ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు. దీంతో దేవినేని ఉమ ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ ఆధిపత్యాన్ని సహించలేక ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో దేవినేని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.