విజయవాడ పక్కన రాజధానికి 30 వేల ఎకరాలు - జగన్ కు దేవినేని ఉమ బంపర్ ఆఫర్...
అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విజయవాడకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధానిపై వైసీపీ గతంలో ఇచ్చిన మాట తప్పి మూడు రాజధానులు అంటోందని వారు ఆరోపిస్తున్నారు. రాజధానిని కాపాడుకునేందుకు అమరావతి రైతులతో కలిసి రోజూ నిరసనలకు దిగుతున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరో ట్విస్ట్ ఇచ్చారు.
విజయవాడ పక్కన 30 వేల ఎకరాలు రాజధాని కోసం తీసుకోవాలంటూ తాజాగా దేవినేని ఉమ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రయత్నాలపై స్పందిస్తూ రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉండాలని, నీళ్లు, ప్రయాణ సౌకర్యం తదితర అవసరాలకు అందుబాటులో ఉండాలని ఉమ సూచించారు. విజయవాడ దగ్గర్లో 30 వేల ఎకరాలు తీసుకుంటే మనస్ఫూర్తిగా ఆహ్వనిస్తామన్నారు. చంద్రబాబు చేసిన ప్రజా రాజధాని అమరావతి ఇదే కదా అంటూ ఉమ ట్వీట్ లో పేర్కొన్నారు.
రాజధాని కోసం టీడీపీ ప్రజాపోరాటం, న్యాయపోరాటం కొనసాగిస్తుందని, మాట తప్పింది, మడమ తిప్పింది మీరే కదా అంటూ ఉమ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. గతంలో అమరావతికి బదులుగా విజయవాడ లేదా గుంటూరు నగరాలకు సమీపంలో రాజధానిని నిర్మిస్తే మేలు జరిగేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజయవాడకు దగ్గర్లో అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి దగ్గరగా ఉండటంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.
రాజధాని రాష్ట్రంమధ్యలో ఉండాలి. నీళ్లు, ప్రయాణసౌకర్యం ఉండాలి. విజయవాడ దగ్గరలో 30వేలఎకరాలు తీసుకోండి. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు.@ncbn చేసిన @PrajaRajadhani అమరావతి ఇదేకదా? @JaiTDP ప్రజాపోరాటం,న్యాయపోరాటం కొనసాగిస్తుంది. మాటతప్పింది, మడమతిప్పింది మీరేకదా @ysjagan pic.twitter.com/iOYdsGe4Mu
— Devineni Uma (@DevineniUma) August 6, 2020