విజయవాడలో దేవినేని ఉమను బెదిరిస్తున్నదెవరు ? పోలీసుల సైలెన్స్ వెనుక ఎవరున్నారు ?
ఒకప్పుడు విజయవాడలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగా, చంద్రబాబు కేబినెట్ మంత్రిగా ఓ వెలుగువెలిగిన దేవినేని ఉమకు అధికారం పోగానే కష్టాలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి. సొంతగడ్డ విజయవాడలోనే ఆయనకు పరిస్దితులు కలిసి రావడం లేదు. టీడీపీ అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే జిల్లాలో ఎమ్మెల్యేగా జైత్రయాత్రకు బ్రేక్ పడటం ఆయనకు ఇప్పుడు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారింది. ఇదే అదనుగా టీడీపీ హయాంలో ఆయన చెలాయించిన పెత్తనంతో ఇబ్బందులు పడ్డ వారంతా ఆయనపై ముప్పేటదాడికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జలవనరుల మంత్రిగా ఆయన హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తుండగా.. స్ధానికంగా కృష్ణాజిల్లాలో వైసీపీలోని సొంత సామాజిక వర్గ నేతలు ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నారు.
విశాఖలో 27 వేల రిజిస్ట్రేషన్లు ఇన్సైడర్ ట్రేడింగేనా ? సీబీఐ విచారణకు దేవినేని ఉమ డిమాండ్..
దేవినేని ఉమ కష్టాలు...
విజయవాడలో ఒకప్పుడు టీడీపీ మంత్రిగా కృష్ణాజిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని ఉమకు అధికారం కోల్పోయిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీకే చెందిన ఎంపీ కేశినాని వంటి వారు ఉమ పెత్తనాన్ని సహించలేక బహిరంగ విమర్శలకే దిగారు. అధినేత చంద్రబాబు జోక్యంతో తాత్కాలికంగా పరిస్ధితి సద్దుమణిగినా ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం జలవనరుల మంత్రిగా తన హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇది చాలదన్నట్లుగా వైసీపీ నేతల నుంచి నేరుగా ఆయనకు బెదిరింపులు
వైసీపీ ఫోన్ కాల్స్ బెదిరింపులు..
గతంలో మంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమ సొంత సామాజిక వర్గ నేతలను తప్ప మిగతా వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. రాజకీయంగా ప్రతీ అడుగూ ఆచితూచి వేసేవారు. జిల్లాలో సామాజికవర్గం అండతో రాజకీయాలు నడిపేవారు. కానీ ఇప్పుడు అదే సామాజికవర్గం నుంచి ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే పార్టీ ఒకటే మార్పు. ప్రత్యర్ధి వైసీపీలో సీఎం జగన్ స్వయంగా ప్రోత్సహిస్తున్న ఉమ సామాజిక వర్గ నేతలే ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిత్యం విమర్శలతో సరిపెట్టకుండా ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముందు వీటిని లైట్ తీసుకున్న మాజీ మంత్రి.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఫోన్కాల్స్ ఆగడం లేదని తెలుస్తోంది.
తామేనంటున్న మంత్రి, ఎమ్మెల్యే...
మాజీ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై వారు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో దేవినేని ఉమ నిత్యం వైసీపీ నేతలపై, అధినేత జగన్పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆయనకు కాల్స్ చేస్తున్నామని, కానీ ఆయన లిఫ్ట్ చేయడం లేదని మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వంటి వారు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్ధితి మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారనే కారణంతోనే ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
ఉమ అనుచరులకు ఫోన్లు...
వైసీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ.. కొద్ది రోజులుగా ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినా బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. వైసీపీకి చెందిన పలువురు నేతలు దేవినేని ఉమ అనుచరులకు ఫోన్ చేసి ఆయనకు ఫోన్ ఇమ్మని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతల ఫోన్కు భయపడి సెల్ఫోన్ ఉమకు ఇస్తే ఏమవుతుందోనని ఓ భయం, అలా కాదని వైసీపీ నేతల ఫోన్ పెట్టేస్తే ఇంకేమవుతోందనని మరో భయం ఇప్పుడు ఉమ అనుచరులను వెంటాడుతోంది. దీంతో వైసీపీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయనంటేనే ఉమ అనుచరులు భయపడుతున్నారట.
పట్టించుకోని పోలీసులు...
వైసీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ తాడేపల్లి పోలీసులకు ఈ నెలలోనే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా కాల్స్ ఆగడం లేదు. తాను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుచరులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరోవైపు ఆ కాల్స్ చేస్తోంది తామేనంటూ వైసీపీ మంత్రి, మరో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కూడా బహిరంగంగానే చెబుతున్నారు. అయినా పోలీసులు మాత్రం ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు కావడంతో వీరిపై చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో దేవినేని ఉమ పరిస్ధితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తాజాగా ప్రెస్మీట్లలో ఆయన జగన్ టార్గెట్గా చేస్తున్న విమర్శలతో వైసీపీ నేతలు రాబోయే రోజుల్లో ఆయన్ను మరింతగా టార్గెట్ చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది.