ఏపీకి త్వరలో మహిళా సీఎం.. ప్రకటన చేయించింది జగనే: బాంబు పేల్చిన దేవినేని
ఏపీకి త్వరలో ఓ మహిళ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తేలికగా తీసుకోవద్దని, ఆ వ్యవహారానికి సంబంధించిన చాలా రహస్యాలు తనకు తెలుసంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బాంబు పేల్చారు. మహిళా సీఎం రాబోతున్నట్లు ప్రచారం చేయిస్తున్నది సీఎం జగనే అని, ఈ మేరకుర తన సన్నిహితుల ద్వారా క్రమం తప్పకుండా ట్వీట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి కాబోయే ఆ మహిళా సీఎం ఎవరో, అసలీ ప్రచారమంతా ఎందుకు జరుగుతున్నదో అతిత్వరలోనే బయటపెడతానని ఉమ చెప్పారు.
కామెడీ షో..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్టు సందర్శనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వెలిగొండ పర్యటన కామెడీ షోలాగా సాగిందని, ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని దేవినేని అన్నారు. తొమ్మిది నెలల కిందట జగన్ సీఎం అయినవెంటనే వెలిగొండపై రివ్యూచేశారని, ఒకటో టన్నెల్ పనులు 90.96 శాతం పూర్తయ్యాయని, 17.78కిలోమీటర్ల వరకు టన్నెల్ బోరింగ్ పనులుపూర్తయ్యాయని, మొత్తం 18.798 మీటర్లలో 17.78కి.మీటర్ల వరకు పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తుచేశారు.
సంచులు మోసేవాళ్లు ఇంజనీర్లా?
వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ సీఎం అయిన తర్వాతే వెలిగొండ టన్నెల్ నిర్మాణం పూర్తయినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాకా ఊదడం హాస్యాస్పదంగా ఉందని దేవినేని అన్నారు. జగన్ అక్రమార్జనను సంచుల్లో మూటగట్టుకుని బెంగళూరుకు చేరవేసే బంటు సజ్జల అని, అలాంటి వ్యక్తి ఇంజనీర్ మాదిరిగా ప్రాజెక్టుల గురించి మాట్లాడం వినడానికి అసలు బాగోదని ఉమ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం జగన్ ఆడిన రివర్స్ డ్రామాలన్నింటిపై సీబీఐ విచారణ జరిగితీరుతుందని, తప్పుచేసినవాళ్లంతా జైలు పాలవుతారని టీడీపీ నేత విమర్శించారు.
శివరాత్రి నాడు మహాపాపం..
బీసీల పట్ల సీఎం జగన్ తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకున్నాడని, బీసీ నాయకుడైన అచ్చెంనాయుడు అసెంబ్లీలో వైసీపీ సర్కారును ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా ఈఎస్ఐ కుంభకోణం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దేవినేని మండిపడ్డారు. పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అచ్చెన్నాయుడిపై బురదజల్లాలని చూడటం, వైసీపీప్రభుత్వానికే చెల్లిందని దేవినేని ఉమ మండిపడ్డారు.
Recommended Video
ఏపీకి మహిళా సీఎం..
‘ఆర్మీ కమాండర్లుగా మహిళలకూ అవకాశం కల్పించాల్సిందే...' అంటూ నాలుగు రోజుల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై స్పందిస్తూ.. వైసీపీ నేత, విజయవాడ పార్లమెంట్ ఇన్ చార్జి పీవీపీ.. ‘‘ఏపీకి మహిళా సీఎంను చూడాలని ఉంది'' అంటూ ట్వీట్ చేశారు. సీబీఐ కేసుల్లో సీఎం జగన్ జైలుకు వెళితే, ఆయన భార్య వైఎస్ భారతి లేదా సోదరి శర్మిలలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఏపీలో చాలాకాలంగా సాగుతున్నదే. పీవీపీ ట్వీటు వెనుక సీఎం జగన్ హస్తం ఉందంటూ దేవినేని ఉమ చెప్పడం సంచలనంగా మారింది.