అజ్ఙాతంలోకి టీడీపీ మాజీమంత్రి: మోకా హత్యకేసులో బిగుస్తోన్న ఉచ్చు: గాలిస్తోన్న పోలీసులు
విజయవాడ: రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్యోదంతం ఉచ్చు క్రమంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి కొల్లు రవీంద్ర మెడకు బిగుసుకుంటోంది. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడిగా గుర్తింపు పొందిన మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ ప్రేరేపితమైన హత్యగా పోలీసులు ధృవీకరించారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆరుమంది పోలీసులు కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లగా.. ఆయన కనిపించలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం ఇంట్లో సోదాలను చేపట్టారు. అన్నిచోట్లా గాలించారు. అయిన్పటికీ.. కొల్లు రవీంద్ర ఆచూకీ తెలియరాలేదని అంటున్నారు. కొల్లు రవీంద్ర అజ్ఙాతంలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. దీనితో ఆయన కోసం ఆరా తీయడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మోకా భాస్కర్ రావు హత్యోదంతంలో కొల్లు రవీంద్ర పాత్ర ఉందంటూ ఫిర్యాదులు అందడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింతా నాంచారయ్య అలియాస్ చిన్నిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. కొల్లు రవీంద్ర పేరు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య అనంతరం చింతా చిన్ని కొంతమంది టీడీపీ నాయకులతో ఫోన్లో సంభాషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో కొల్లు రవీంద్ర పేరు లేదని తేలింది.
మోకా భాస్కర్ రావును హతమార్చిన తరువాత నెలకొనే పరిణామాలను తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర.. చింతా చిన్నికి హామీ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ప్రోద్బలంతోనే చింతా చిన్ని ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి టీడీపీ నాయకులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మోకా భాస్కర్ రావు ఒంటరిగా బైక్పై వెళ్తోన్న సమయంలో ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీనితో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ కేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడిగా, చింతా కిషోర్లను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్లతో పాటు కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.