టీడీపీకి గుడ్ బై : బీజేపీలోకి సాధినేని యామినీ: ఈ నెల 10న నడ్డా సమక్షంలో..!
టీడీపీలో ఒక దశలో ఫైర్ బ్రాండ్ గా కనిపించిన సాధినేని యామిని కొంత కాలంగా పార్టీకీ దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. కొద్ది కాలంగా యామినీ టీడీపీ వీడుతారనే ప్రచారం సాగినా..యామినీ ఖండించారు. కొద్ది కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో తరచూ సమావేశం అవుతున్నారు. దీంతో..బీజేపీలోకి వెళ్తారని భావించారు. అయినా..ఇప్పటి వరకు చేరలేదు. ఇక, తాజాగా యామినీ బీజేపీలో అధికారికంగా చేరాలని నిర్ణయించారు. ఈ నెల 10న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ పడ్డా విజయవాడకు వస్తున్నారు. ఆయన సమక్షంలో యామినీ బీజేపీలో చేరనున్నారు. మాజీ కేంద్రం మంత్రి యామినీని బీజేపీలోకి రావాలని సూచింటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన సాధినేని యామిని ..రాజకీయ అజ్ఞాతంలో అందుకే ఉన్నానని వ్యాఖ్య
టీడీపీకి మద్దతుగా టీవీ చర్చల్లో..సోషల మీడియాలో యాక్టివ్ గా పని చేసిన సాధినేని యామినీ ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మద్దతుగా బలంగా వాదన వినిపించేవారు. ఎన్నికల సమయంలో గుంటూరు పశ్చిమం నుండి పోటీ చేయాలని ఆశించారు. కానీ, టీడీపీ నుండి సీటు దక్కలేదు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల వేళ..జనసేన నేతలతోనూ వాగ్వాదానికి దిగారు. ఇక, ఎన్నికలు పూర్తయిన సమయం నుండి టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆ సమయంలోనే బీజేపీలో చేరాలని భావించారు. అయితే, పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో వెనుకడుగు వేసారు. అప్పటి నుంది విదేశాల్లోనే ఉంటున్న యామినీ కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ద్వారా యామినీ బీజేపీలో చేరటం ఖాయమని భావించినా..చేరలేదు. ఆ తరువాత టీడీపీ నుండి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి సూచన మేరకు యామినీ బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ఇందు కోసం ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాతోనూ చర్చలు చేసినట్లు సమాచారం. ఆయన సైతం పార్టీ ముఖ్యనేత సమక్షంలో పార్టీలో చేరాలని సూచించారు.
దీంతో..సాధినేని యామినీ ఈ నెల 10 వతేదీ జేపీ నడ్డా సమక్షంలో విజయవాడలో బీజేపీలో చేరనున్నారు. ఎన్నికల సమయంలో యామినీతో పాటుగా సినీ నటి దివ్యవాణి సైతం టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. అయితే, ఎన్నికల తరువాత ఈ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. యామినీ ఇప్పుడు బీజేపీలో చేరటం ఖాయమైంది. అయితే, దివ్య వాణి మాత్రం టీడీపీలోనే ఉంటున్నా యాక్టివ్ గా మాత్రం వ్యవహరించటం లేదు. అదే విధంగా.. ఎన్నికల సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపించిన ముళ్లపూడి రేణుక సైతం ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. దీంతో, టీడీపీ మహిళా నేతల్లో పంచుమర్తి అనురాధ .. వంగలపూడి అనిత మాత్రమే ప్రస్తుతం పార్టీ వాయిస్ ను టీవీ చర్చల్లో బలంగా వినిపిస్తున్నారు.