నేను విన్నాను, నేను ఉన్నాననే జగన్కు మహిళల గోడు వినిపించడం లేదా..?: వంగవీటి రాధా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే జగన్కు మహిళల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. అమరావతి పరిధిలో ఒకే సామాజిక వర్గం ఉంటే రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎలా గెలుస్తోందని ఆయన ప్రశ్నించారు. సామాజిక వర్గం పేరుతో రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కోసం దీక్ష చేస్తున్న రైతులు, మహిళలకు రాధా సంఘీభావం తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
అమరావతి రాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఇందులో అనుమానానికి తావులేదన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీకో, వర్గానికి ఇవ్వలేదని స్పష్టంచేశారు. కానీ రైతులను ఇబ్బందికి గురిచేసేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శలు చేశారు.
రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి కావాలని ఇదివరకు జగన్ చెప్పింది అబద్దమా అని రాధా ప్రశ్నించారు. నిండు సభలో 30 వేల ఎకరాల భూమి కావాలని చెప్పి.. ఇప్పుడు మాట మార్చడం ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు మంత్రులు రైతులను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని నోటికొచ్చినట్టు దూషించడం తగదన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తీరు మార్చుకోవాలని సూచించారు. అధికారం చేపట్టిన 9 నెలల్లో వైసీపీ నేతల మాటల తీరు, వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.