దుర్గ గుడి వెండిరథాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు .. మంత్రి వెల్లంపల్లి బర్తరఫ్ కు దేవినేని డిమాండ్
ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు . విజయవాడ దుర్గ గుడి వెండి రథంలో మూడు సింహాలు మాయమైన ఘటనపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. దుర్గ గుడిని సందర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వ అసమర్థతపై మండిపడ్డారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దుర్గ గుడి ఈవో సురేష్ బాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడిన టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు దేవినేని ఉమ. ఏపీలోని ఆలయాలపై జరుగుతున్న దాడులపై జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలి అంటూ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం కాపాడాలంటూ దేవినేని ఉమా పేర్కొన్నారు.
విజయవాడ కనకదుర్గా ఆలయంలో దుర్గమ్మ రథానికి ఉండే మూడు వెండి సింహాలు అదృశ్యం అయిన ఘటనకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యుడు అంటూ దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు.
Recommended Video
ఆలయాలు ,చర్చిలు, మసీదుల పై దాడులు ఖండిస్తున్నామని దేవినేని ఉమా పేర్కొన్నారు .టిడిపి నేతలతో కలిసి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన దేవినేని ఉమా వెండి రధాన్ని పరిశీలించారు. ఈ ఘటన దుర్మార్గమని, తప్పును కప్పి పుచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు . నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఈవో సురేష్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.