ఏపీలో వాలంటీర్ల జీతం రూ.18 వేలకు పెంపు- టీడీపీ ఎమ్మెల్యే సంచలన హామీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాగానే 2.7 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకు ప్రతీ 50 ఇళ్లకొకరి చొప్పున వీరిని నియమించారు. వీరికి రూ.5 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇది చాలడం లేదంటూ తాజాగా వాలంటీర్లు ఆందోళనలు కూడా చేశారు. దీంతో సీఎం జగన్ వారికి ప్రోత్సాహకాలు ఇస్తాం కానీ గౌరవ వేతనం పెంచలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదే అదనుగా వారికి భారీ మొత్తంలో జీతాలు పెంచుతామంటూ టీడీపీ హామీ ఇస్తోంది.
విజయవాడలో జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాలంటీర్లకు భారీ హామీ ఇచ్చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాన్ని 5 వేల నుంచి 18 వేలకు పెంచుతామన్నారు. ఐదు వేల రూపాయలు ఇచ్చి వైసీపీ సర్కారు వారితో గొడ్డు చాకిరీ చేయించుకుంటోందన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనే అని, దాన్ని కాపీ కొట్టి వైసీపీ సర్కారు అమలు చేస్తోందన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు తమ గౌరవ వేతనాన్ని కనీసం పదివేలకు పెంచాలని ఆందోళనలు చేస్తున్న వేళ టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. అలాగే వైసీపీకి సహకరించలేదంటూ రాష్ట్రంలో పలుచోట్ల వాలంటీర్లను వైసీపీ సర్కారు తొలగిస్తున్న వేళ టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. గద్దె రామ్మోహన్ ఇచ్చిన హామీ టీడీపీలో అంతర్గతంగా చర్చ తర్వాతే ఇచ్చిందా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదైమైనా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నేపథ్యంలో వాలంటీర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.