వైసీపీలోకి వల్లభనేని వంశీ..! ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దం: జగన్ గ్రీన్ సిగ్నల్..!
గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రెండు రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి..తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఆయనకు బంధువు..బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరితోనూ సమావేశమయ్యారు. ఆయన గుంటూరులో ఉండగా ప్రత్యేకగా వెళ్లి కలిసారు. దీంతో..వంశీ టీడీపీ నుండి బయటకు వస్తారని ఆయన బీజేపీలో చేరుతారా వైసీపీ వైపు చూస్తున్నారా అనే చర్చ సాగింది. ముఖ్యమంత్రి జగన్ తో వంశీ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మంత్రులు పేర్ని నాని..
కొడాలి నాని తో పాటుగా ఆయన సీఎం వద్దకు వచ్చారు. వంశీ ముఖ్యమంత్రితో భేటీ కేవలం మర్యాదపూర్వకమే అని సీఎంఓ వర్గాలు చెబుతున్నా...ఆయన వైసీపీలోకి రావటానికి ..టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సిద్దంగానే ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అయితే, గన్నవరం నుండి తన రాజకీయ భవిష్యత్ కు సీఎం జగన్ ఇచ్చిన హామీ తో త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో హాట్ టాపిక్ ..సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఎందుకంటే
సీఎం జగన్ తో వంశీ భేటీ...
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్ గా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవ్వటం రాజకీయంగా కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వంశీ ఈ రోజు ఉదయం సుజనా చౌదరితో సమావేశమయ్యారు. దీంతో..ఆయన బీజేపీలోకి వెళ్లటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని ప్రచారం సాగింది. కానీ, సుజనా చౌదరి మాత్రం వంశీ తన వ్యక్తిగత పనుల కోసమే తనను కలిసారని చెప్పుకొచ్చారు. తాను టీడీపీలో ఉండలేనని..రాజకీయంగా పార్టీ మార్పు నిర్ణయం తీసుకుంటానని వంశీ ఆయనతో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక, మంత్రులుపేర్ని నాని..కొడాలి నాని తో కలిసి వంశీ సడన్ గా ముఖ్యమంత్రి జగన్ వద్దకు వచ్చారు. దీంతో..ఆయన టీడీపీ వీడటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నా..తరువాతి అడుగు ఏంటనేది మాత్రం క్లారిటీ రావటం లేదు.
వైసీపీలో చేరేందుకే అంటూ..
వంశీ రాజకీయ అడుగుల పైన రకరకాల ప్రచారాలు సాగుతున్నా..విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఆయన వైసీపీలో చేరటానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎం జగన్ శాసనసభా వేదికగా ఏ పార్టీలో వారయినా తమ పార్టీలో చేరాలంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పటంతో..అందుకు సైతం వంశీ సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు మాత్రం వంశీ కేవలం మర్యాదపూర్వకంగానే..నియోజకవర్గ సమస్యల మీద కలిసారని చెప్పుకొస్తున్నారు. వంశీ వైసీపీలో చేరేందుకు సిద్దమని...అయితే, గన్నవరం లో వైసీపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన వెంకట్రావు ఉండగా..ఇప్పుడు పార్టీ మారితే లభించే ప్రాధాన్యత మీదనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ దీని మీద వంశీ రాజకీయ భవిష్యత్ పైన స్పష్టమైన హామీ ఇస్తే వంశీ పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
జగన్ కు పాత మిత్రుడే..
జగన్..వంశీ మధ్య చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఒక దశలో 2019 ఎన్నికల ముందు వంశీ వైసీపీ నుండి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. అయితే, వంశీ వాటిని ఖండించారు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో ఆయన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసారని..నకిలీ ఇంటి పట్టాల కేసు నమోదైంది. అయితే, ఇప్పటికప్పుడు వంశీ రాజీనామా చేయకుండా టీడీపీలోనూ ఉంటూ.. సమయం చూసి వైసీపీలో చేరుతారని విశ్వసనీయ సమాచారం. వంశీ వైసీపీలో చేరేందుకు ముఖ్యమంత్రి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్ మీద హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో టీడీపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం వైసీపీతో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.