భక్తి ఉంటే సీఎం ఇంటి ముందు చెక్క భజన చేయండి .. ఉద్యోగ సంఘాలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఫైర్
సెలెక్ట్ కమిటీ వివాదంలో ఏపీ ఉద్యోగ సంఘాలు జోక్యం చేసుకోవటంపై టీడీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులపై చర్యలు తీసుకోవాలంటూ మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ హరి చందన్ ను కలవడాన్ని అసెంబ్లీ, సెక్రటేరీయేట్ ఉద్యోగ సంఘాలు సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే . ఇక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ నీలం సాహ్నీని కలిసి ఉద్యోగులపై ఈ తరహా ఒత్తిడి మంచిది కాదని , ఉద్యోగుల పక్షాన ఉండాలని కోరారు.
సెలెక్ట్ కమిటీ వివాదంలో గవర్నర్ ఏం చేస్తారు? ఉద్యోగ సంఘాల ఎంట్రీతో ఏం జరగనుంది ?
మండలి వివాదంలో ఉద్యోగ సంఘాల జోక్యంపై టీడీపీ ఎమ్మెల్సీలు ఫైర్
అసెంబ్లీ కార్యదర్శికి బాసటగా నిలుస్తూ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రూల్స్కు అనుగుణంగా పని చేసే అధికారులకు భద్రత కల్పించాలని కోరారు. ఇక దీంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మండలి వివాదంలో ఉద్యోగ సంఘాల నాయకులు కార్యదర్శికి అండగా నిలుస్తూ రూల్సుకు విరుద్దంగా వ్యవహరించాలని అధికారులను టీడీపీ ప్రోత్సహిస్తే , చైర్మన్ టీడీపీ ఆదేశానుసారం నడిస్తే వారికే నష్టం అంటూ హెచ్చరించారు. ఇక దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు.
మండలి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సభాహక్కుల నోటీసు ఇస్తామని వార్నింగ్
సచివాలయ ఉద్యోగ సంఘం నేతలపై టీడీపీ ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, అశోక్బాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు . ఉద్యోగ నేతలు మితిమీరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మండలి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సభాహక్కుల నోటీసు ఇస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు ఎమ్మెల్సీలు హెచ్చరికలు జారీ చేశారు. చైర్మన్, కార్యదర్శి మధ్య నిబంధనల విషయంతో ఉద్యోగ సంఘాల నాయకులకు ఏంటి సంబంధం అని మండిపడ్డారు .
ఉద్యోగుల సమస్యలపై సంఘాల నేతలు దృష్టి పెట్టాలని హితవు
మీ భక్తి చూపించాలనుకుంటే సీఎం ఇంటి ముందు చెక్క భజన చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు.పనికిమాలిన విషయాలను వదిలిపెట్టి ఉద్యోగుల సమస్యలపై సంఘాల నేతలు దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు . ఇక ఇళ్ల స్థలాల పంపిణీకి రాజధానిలో 4 వేల ఎకరాలు సేకరిస్తామనడం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, అశోక్బాబు మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు పద్ధతి మార్చుకోవాలని అసహనం వ్యక్తం చేశారు.