శభాష్ మిథున్ రెడ్డి: వైసీపీ ఎంపీపై ప్రశంసలు: రూటు మార్చిన కేశినేని నాని!
విజయవాడ: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడుకుంటున్న నాయకుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఒకరు. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆయన ఓ ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా. మొదట్లో సొంత పార్టీకే చెందిన శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్నపై, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్పైనా నిప్పులు చెరిగారు. ఇక తన రూట్ మార్చారు. ఈ సారి వైఎస్ఆర్ సీపీకే చెందిన లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. శభాష్ మిథున్ రెడ్డి అని ప్రశంసిస్తూనే.. చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ను సంధించారు.
ప్రత్యేక హోదా సాధిస్తే..
శభాష్ మిథున్ రెడ్డి గారు! అంటూ ఆయన తన ట్వీట్ను ఆరంభించారు. ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత తమదేనని మిథన్ రెడ్డి ధైర్యంగా అంగీకరించారని ప్రశంసించారు. ఇలా అంగీకరించినందుకు తాను మిథున్ రెడ్డిని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు.
నా రాజీనామాపై నా కంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది: కుమారస్వామి
ప్రత్యేక హోదాను సాధించడం అంటూ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాష్ట్రం నడిబొడ్డున సన్మానం చేస్తామని అన్నారు. సాధించలేకపోతే- వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తారో చెప్పగలరా? అని నిలదీశారు. ఓ దినపత్రికలో ప్రచురితమైన మిథన్రెడ్డి ఇంటర్వ్యూ క్లిప్పింగ్ను దీనికి జోడించారు. ప్రత్యేక హోదా డిమాండ్ను అడ్డుగా పెట్టుకుని కేశినేని వైఎస్ఆర్ సీపీని ఇబ్బందుల్లో నెట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీల్లో ఈ ట్వీట్పై పెద్ద చర్చే నడుస్తోంది.