2024లో టీడీపీ అధికారంలోకి రావాలంటే?: కేశినేని నాని ఇన్డెప్త్ కామెంట్: ఎవరిని ఉద్దేశించి?
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించిన తరువాత రాజకీయంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో. మూడు రాజధానులను అడ్డుకోవడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు గానీ, పోరాటాలు గానీ పెద్దగా ఫలించనట్టే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన తరువాత.. అసెంబ్లీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్?: మూడు రాజధానులపై కేంద్రం ఫుల్ క్లారిటీ: హైకోర్టులో కౌంటర్
గడువు తరువాత అద్భుతాలను ఆశించినా..
దీనికోసం 48 గంటల గడువును కూడా ఇచ్చారు. గడువు ముగిసింది. గడువు ముగిసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏదైనా సంచలన ప్రకటన చేస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. దీని తరువాత టీడీపీలో ఎలాంటి అద్బుతాలు చోటు చేసుకోలేదు. చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మీడియా ముందుకొచ్చి.. ఎప్పట్లాగే స్పందించారు. కొత్త విషయాలనేవీ వెల్లడించలేదు. మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు ఏదైనా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తారా? లేక కొత్త ఎత్తులను వేస్తారా? అని ఎదురుచూసిన సగటు టీడీపీ అభిమానుల్లో జోష్ నింపలేకపోయారు.
టీడీపీ నేతల్లో నిర్లిప్తతా?
48 గంటల గడువు ముగిసిన తరువాత తెలుగుదేశం పార్టీ నేతల్లో ఓరకమైన నిర్లిప్తత ఆవరించినట్లు కనిపిస్తోంది. ఇక 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. విజయవాడకు చెందిన టీడీపీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని తాజాగా చేసిన ఓ ట్వీట్.. దీన్ని ప్రస్ఫూటించేలా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల మనోభావాలను ప్రతిబింబింపజేసేలా ఉందంటున్నారు.
కేశినేని నాని ట్వీట్ సారాంశమేంటీ?
ఇంతకీ ఆ ట్వీట్ సారాంశమేమిటంటే- మన కలలను మనమే సాకారం చేసుకోవాలి. ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం.. అని కేశినేని నాని తాజాగా ఓ ట్వీట్ సంధించారు. తాము కన్న కలలను సాకారం చేసుకోవడానికి తామే ప్రయత్నించాలే తప్ప.. మరొకరు దాన్ని సాకారం చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. అమరావతి అనేది చంద్రబాబు కన్న కల అది.. అది సాకారం కావాలంటే 2024లో అధికారంలోకి రావాల్సి ఉంటుందనీ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మించాలనే కలలు కన్నారని చెప్పారు.
Recommended Video
ట్వీట్ ఎవరిని ఉద్దేశించి..
2024లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆ కల సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా పార్టీలో ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. మీడియా సమావేశాల ద్వారానో, లేక పత్రికా ప్రకటనల వల్లనో అది సాధ్యం కాదని అన్నారు. ఇలాంటి పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని నాని తేల్చి చెప్పారు. ఈ ట్వీట్ను ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారనేది తెలియరావట్లేదు. మీడియా సమావేశాల వల్ల ప్రయోజనం లేదని, జనంలోకి వెళ్లాల్సి ఉంటుందని, ప్రజల విశ్వాసాన్ని పొందగలిగితేనే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాగలమని ఆయన సూక్ష్మంగా చెప్పుకొచ్చారని అంటున్నారు.