వైఎస్ జగన్ ను తుగ్లక్ తో పోల్చిన టీడీపీ ఎంపీ
విజయవాడ: కృష్ణానదికి వరదలు సంభవించి రాజధాని అమరావతి పరిధిలోని తీర ప్రాంత గ్రామాలు వరద ముంపునకు గురి కావడంపై రాజుకున్న రాజకీయ రచ్చ చల్లారలేదు. దానికి మరింత ఆజ్యం పోస్తూనే వస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అమరావతి తరలింపుపై త్వరలో ఓ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనల అనంతరం చెలరేగిన దుమారం కొనసాగుతుండగానే.. తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏకంగా మొఘల్ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ తో పోల్చారు. వైఎస్ జగన్ కూడా తుగ్లక్ లా చరిత్రలో నిలిచిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
విజయవాడలో అర్ధరాత్రి కలకలం: పార్క్ చేసిన వాహనాలకు నిప్పు: రియల్ ఎస్టేట్ తగాదేనా?
చరిత్ర పుస్తకాల్లో తుగ్లక్ గురించి తాము చదువుకున్నామని, ఇప్పుడు చూస్తున్నామనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ కూడా ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల అనంతరం రాజధాని అమరావతి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నందు వల్లే కేశినేని ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.
చిన్నపుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివిన విషయం తెలిసిందేనని, 1328 సంవత్సరంలో ఆయన తన రాజధానికి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు, అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీకి మార్చిన వైనం గురించి తెలుసుకున్నామని అన్నారు. వైఎస్ జగన్ కూడా తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నానని కేశినేని నాని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కేశినేని నానిని ట్రోల్ చేస్తున్నారు ఆ పార్టీ అభిమానులు.
జగన్ రెడ్డి గారు @ysjagan చిన్నపుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్ర లోని దౌలతాబాద్కు తిరిగి అక్కడి నుండి ఢిల్లీ కి మార్చిన వైనం.
— Kesineni Nani (@kesineni_nani) August 22, 2019
మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. pic.twitter.com/QqhyWSreAH