బెడ్ దొరక్క మాజీ ఎమ్మెల్యే తమ్ముడి మృతి: జగన్ సర్కార్పై ముప్పేటదాడి: ఊహించలేం: కేశినేని
విజయవాడ: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యవహారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తాజా అస్త్రాలుగా మారాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన క్రమంగా తమ విమర్శలకు పదును పెడుతున్నాయి. కరోనా వైరస్ను నియంత్రించడంలో జగన్ సర్కార్ దారుణంగా విఫలమైందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం నియంత్రణా చర్యలను చేపట్టట్లేదని విమర్శిస్తున్నాయి.
Recommended Video
సోనూసూద్కు చంద్రబాబు: మేం భరిస్తామని హామీ: త్వరలో కలుద్దామన్న యాక్టర్: స్పందించిన రైతు
జగన్ సర్కార్పై ముప్పేట దాడి..
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉదంతంపై జనసేన పార్టీ ఇదివరకే స్పందించింది. 200 పడకల సామర్థ్యం ఉన్న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయిందంటూ విమర్శించింది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య చికిత్సను అందిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణాస్త్రాలను సంధించారు.
బెడ్ దొరక్క.. అంబులెన్స్లో వైద్యం..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ట్వీట్ ద్వారా జగన్ సర్కార్పై నిప్నులు చెరిగారు. విజయవాడకు చెందిన ఓ మాజీ శాసన సభ్యుడి సోదరుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. కరోనా బారిన పడిన ఆయనకు ఆసుప్రతిలో బెడ్ కూడా ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. సకాలంలో చికిత్స చేయించలేకపోయిందని అన్నారు. ఫలితంగా- ఆయన 24 గంటల పాటు అంబులెన్స్లో గడపాల్సి వచ్చిందని చెప్పారు. సరైన వైద్యం దక్కకపోవడంతో అంబులెన్స్లోనే ప్రాణాలు విడిచారని కేశినేని నాని ధ్వజమెత్తారు.
సామాన్యుల పరిస్థితేంటీ..?
ఓ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. ఇక సామాన్యు ల గతేమిటని కేశినేని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో నివసించలేని పరిస్థితి ఎదురైందని విమర్శించారు. కరోనా వైరస్ వంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన చికిత్సను సకాలంలో అందంచలేకపోతోందని అన్నారు. సామాన్యులు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో.. ఊహించడానికే భయమేస్తోందని కేశినేని నాని ట్వీట్స్ చేశారు.
లక్షకు చేరువగా..
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొద్దిరోజులుగా వేల సంఖ్యలో నమోదవుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 7627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కు చేరుకుంది. ఇప్పటిదాకా 46,301 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. వెయ్యి మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య 1041కి చేరింది. యాక్టివ్గా ఉన్న కేసులు సంఖ్య 48,956గా నమోదైంది. ఈ పరిణామాలన్నీ జగన్ సర్కార్పై విమర్శలను గుప్పించడానికి కారణమౌతున్నాయి.