టీడీపీ..ఫుల్ హ్యాపీ: జగన్ టార్గెట్గా: స్థానిక ఎన్నికల వాయిదాపై ఘాటు వ్యాఖ్యలు.. సెటైర్లతో.. !
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కనిపిస్తోన్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తెలుగుదేశం పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఎన్నికలు వాయిదా పడటం టీడీపీలో సంతోషాన్ని నింపింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాయిదా పడటానికి కరోనా కారణం కాదని.. తాము ఓడిపోతామనే భయం వల్లే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పని చేయించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకున్నారు. సెటైర్లతో విరచుకుపడుతున్నారు.
జగన్ సర్కార్ను కేంద్రం అదను చూసి దెబ్బకొట్టిందా? టీడీపీ డిమాండ్..బీజేపీ ఫిర్యాదు: 48 గంటల్లో..!
కరోనా భయమా.. ఓటమి జ్వరమా..
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, కృష్ణాజిల్లాకు చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తదితరులు స్పందించారు. ఓటమి చవి చూస్తామనే భయంతోనే అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికలను వాయిదా వేయించిందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కరోనా భయమా..ఓటమి జ్వరమా.. అంటూ ఎద్దేవా చేశారు.
కరోనాతో ఎవరైనా మరణిస్తే..
ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి ముందుస్తు జాగ్రత్తలు తీసుకోలేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. వైరస్ బారిన పడి ఎవరైనా మరణిస్తే.. దానికి వైఎస్ జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో కేసు పాజిటీవ్గా తేలినప్పటికీ.. నివారణ చర్యలను చేపట్టలేదని అన్నారు.
స్థానిక ఎన్నికలు వాయిదా పడటం..
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు మూడుసార్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చోవాల్సి ఉంటుందని, ఈ సందర్భంగా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. అయినప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయడం హర్షణీయమని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రధానాధికారి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
జాతీయ విపత్తుగా ప్రకటించిన తరువాత..
దేశంలో పెద్ద ఎత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని టీడీపీ నాయకులు స్వాగతిస్తున్నారు. తాము కోరుకున్న విషయాన్ని కరోనా తీర్చినట్టుగా భావిస్తున్నారు.