హోదా కోసం పోరాడారా..? సీబీఐ ఎంక్వైరీ కోసం నిరసనలా, వైసీపీ ఎంపీలపై కేశినేని నాని ఫైర్..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి భూ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని నిన్న ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేశినేని ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరితే కేంద్రం ఆమోదిస్తుందని.. అలాంటప్పుడు ఎంపీలు ధర్నాలు చేయడం ఎందుకుని మండిపడ్డారు. ఈ విషయం సీఎం జగన్కు తెలియదా అని ప్రశ్నించారు.
సీబీఐ విచారణ కోసం ఆందోళన చేసిన ఎంపీలు.. ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. రాష్ట్రానికి హోదా కోసం ఎంపీలు ఎప్పుడు పోరాడుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వైసీపీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. కానీ సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేయడం ఏంటీ అన్నారు. మరీ సీఎం జగన్పై ఉన్న సీబీఐ కేసులు త్వరగా విచారణ జరిగేలా ఎందుకు సహకరించడం లేదు అని కేశినేని నాని నిలదీశారు.
టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తు జరపాలని వైసీపీ ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ధర్నా చేపట్టారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. దానిపై కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. హోదా విషయాన్ని మరచి.. పార్లమెంట్ ఆవరణలో సీబీఐ విచారణ కోసం నిరసన చేయడం సరికాదన్నారు.