Chandrababu: పయ్యావులను పరామర్శించిన చంద్రబాబు: తెలంగాణ టీడీపీ నేతతో కలిసి ఆసుప్రతికి..!
విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ను సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పయ్యావులకు అందుతోన్న వైద్య చికిత్స గురించి డాక్టర్ల వద్ద ఆరా తీశారు. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా పయ్యావుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Chandrababu: హ్యాపీ బర్త్ డే అద్వానీజీ: బీజేపీ కురువృద్ధుడికి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు..!
ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ భవనంలో ప్రజా పద్దుల కమిటీ సమావేశం సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే పయ్యావుల వాంతులు చేసుకున్నారు. తీవ్రంగా చెమటలు పట్టడం, ఆగకుండా వాంతులు చేసుకోవడంతో ఆయనను సచివాలయంలోని డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల పయ్యావుల అనారోగ్యానికి గురయ్యారని డాక్టర్లు వెల్లడించారు. దీనికి అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు.
ఈ ఉదయం చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి ఆయుష్ ఆసుపత్రికి వెళ్లారు. పయ్యావులను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పయ్యావులకు అందుతోన్న చికిత్స వివరాల గురించి డాక్టర్ల వద్ద ఆరా తీశారు. ఆ సమయంలో పయ్యావుల కాస్త హుషారుగా కనిపించారు.
ఆసుపత్రిలో చేరిన తరువాత కూడా వాంతులు ఆగలేదని, రెండు రోజుల పాటు ఇబ్బంది పెట్టాయని పయ్యావుల చంద్రబాబుకు వివరించారు. ఆదివారం నుంచి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు.