పింఛన్లపై ఏపీ అసెంబ్లీలో రచ్చ- ఎప్పుడు పెంచుతారని టీడీపీ ప్రశ్న- మీరేం చేశారన్న వైసీపీ
ఏపీ అసెంబ్లీని రాష్ట్రంలో పేదల పింఛన్ల పెంపు వ్యవహారం కుదిపేసింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవడం లేదంటూ విపక్ష టీడీపీ ప్రశ్నించింది. పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే పింఛన్లను 2000 నుంచి 3000కు తీసుకొని పోతామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటివరకూ ఏడాదిన్నరలో కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని టీడీపీ గుర్తుచేసింది.
రాష్ట్రంలో వైసీపీ మ్యానిఫెస్టో అమల్లో భాగంగా పింఛన్ల పెంపు చేపట్టాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం ఆలస్యం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. దీని వల్ల పేదలు నష్టపోతున్నారని టీడీపీ విమర్శించింది. ప్రభుత్వం పేదల పింఛన్లు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని టీడీపీ నేత రామానాయుడు నిలదీశారు. పింఛన్ల పెంపు చేసి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాది పించన్ల పెంపు జరగకపోవడం వల్ల పేదలు నష్టపోయిన మొత్తాన్ని వారికి ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
దీనికి ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స, కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదల పింఛన్లు ఎంత ఉన్నాయి, ఆ తర్వాత ఎంత పెరిగిందన్నది జనం చూస్తూనే ఉన్నారని మంత్రి బొత్స గుర్తుచేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు రెండు వేల రూపాయలకు పెంచారని, తామొచ్చాక దాన్ని 2250 కు పెంచామన్నారు. అది ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పించన్ల కంటే తామే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నామని బొత్స తెలిపారు.
Recommended Video
ఆ తర్వాత తిరిగి టీడీపీ నేత రామానాయుడు తన నియోజకవర్గంలో పేదలు కనిపించి పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయని అడుగుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం జగన్.. పింఛన్లపై చర్చకు తాము సిద్ధమని, కానీ దాన్ని వక్రీకరిస్తామంటే వ్యతిరేకిస్తామన్నారు. టీడీపీకి ఎన్నికలు వస్తేనే పింఛన్లు గుర్తుకొస్తాయని, కానీ తమకు ఐదేళ్ల పాటు పేదలు గుర్తుంటారని జగన్ తెలిపారు.