బోండా ఉమ టీడీపీ వీడుతున్నట్టేనా: ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషణ: మారుతున్న సమీకరణాలు..!
టీడీపీలో మరో కలకలం. టీడీపీ ముఖ్యనేత..పార్టీ మౌత్ పీస్గా వ్యవహరించే బోండా ఉమ మరో పార్టీలో చేరుతున్నారా. ఇప్పుడు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ. కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్న బోండా ఉమ పార్టీని వీడుతున్నారని టీడీపీ ముఖ్య కేంద్రం అంచనాకు వచ్చేసారు. బోండా ఉమా పార్టీ వీడితే విజయవాడ సెంట్ర్లో ప్రత్యామ్నాయ నేత ఎవరనే దాని పైన అప్పుడే అన్వేషణ మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో..ఆయన దీని పైన నేరుగా అధినేతతోనే తేల్చుకొనేందుకు సిద్దమయ్యారు.
కూలుస్తారా..కూల్చమంటారా: చంద్రబాబు-లింగమనేని నివాసమే నెక్స్ట్: షోకాజ్ నోటీసులు..!
అసంతృప్తితో బోండా ఉమా..
2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమ తక్కువ సమయంలోనే పార్టీ అధినేతకు దగ్గర అయ్యారు. అసెంబ్లీలో..బయటా పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు. అయితే, 2014 ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు..పార్టీలోని కొందరు నేతల తీరు పైన ఆయన అసంతృప్తితో ఉన్నారు . తాజాగా కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే, రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మాత్రం విజయవాడలోనే ఉన్నా బోండా ఉమా గైర్హాజరయ్యారు. దీంతో..ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు ఉమా దూరంగా ఉంటుండటంతో ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఇదే సమయంలో అధినేత చంద్రబాబును కలవాలని ఆయనకు ఆహ్వానం అందింది. అయితే, టీడీపీ నేతలు కొందరు మాత్రం బోండా ఉమా పార్టీ మారటం ఖాయమనే అంచనాకు వచ్చినట్లుగా వారు వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది.
ఉమా స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం..
తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన బోండా ఉమా వైసీపీ అభ్యర్ది మల్లాది విష్ణు చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, బోండా ఉమా కొంత కాలంగా మౌనంగా ఉండటం.. కాకినాడ సమావేశంలో పాల్గొనటం ద్వారా .. ఆయన పార్టీ వీడుతున్నారనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పేరుతో నియోజకవర్గంలోని కొందరు పార్టీ ప్రముఖలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. బోండా ఉమా పార్టీని వీడితే సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతగా ఎవరుండాలనే దాని పైన అభిప్రాయ సేకరణ జరిగింది. విజయవాడ కార్పోరేటర్లు కొందరు సైతం ఈ ఫోన్ కాల్స్ అందుకున్న వారిలో ఉన్నారు. వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బోండా ఉమా మరింత అసహనానికి గురయ్యారు. దీని పైన ఫైర్ అయిన ఉమా..నేరుగా ఈ విషయం పైన పార్టీ అధినేత వద్దే తేల్చుకోవాలని నిర్ణయించారు.
Recommended Video
అధినేత హామీతో శాంతిస్తారా..
పార్టీలో సమస్యల పైన అసంతృప్తితో ఉన్న బోండా ఉమ..ఇప్పుడు అధినేత ఇస్తున్న హామీతో పూర్తి స్థాయిలో శాంతి స్తారా లేదా అనే చర్చ సాగుతోంది. తనకు ప్రత్యామ్నాయ నేతగా ఎవరుండాలనే దాని పైనా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఫోన్ కాల్స్ రావటం..అభిప్రాయ సేకరణ చేయటం పైన ఉమా నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. ఆలా జరిగి ఉంటే తాను చర్యలు తీసుకుంటానంటూ ఆయన హామీ ఇచ్చారని చెబుతున్నారు. జూలై 1 కాపు నేతలతో తాను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నానని దానిని హాజరు కావలని చెబుతూనే..మిగిలిన నేతలంతా వచ్చేలా చూడాలంటూ చంద్రబాబు ఆ బాధ్యతను ఉమాకు అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే, పార్టీ కోసం తాను ఎంతో నిబద్దతతో పని చేసినా..తనను విశ్వాసంలోకి తీసుకోకపోవటం పైన ఉమా ఇప్పటికీ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి..బోండా ఉమాతో పాటుగా మరి కొంత మంది కాపు నేతల రాజకీయ భవిష్యత్ ఏంటనేది జులై 1న జరిగే సమావేశం తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.