వైసీపీని టీడీపీని ఇరకాటంలో పెట్టేలా మరో అస్త్రం..అదే జరిగితే!
ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేస్తుంది ఏపీ సర్కార్. అయితే మండలిలో బలంగా ఉన్న టీడీపీ ఎలాగైనా బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది . సామ,దాన, బేధ దండోపాయాలను ఉపయోగించి అయినా అడ్డుకుని తీరాలని కంకణం కట్టుకున్న టీడీపీ సెలెక్ట్ కమిటీ వ్యూహాన్ని తెరమీదకు తీసుకువస్తుంది .
శాసన మండలిలో రెండు బిల్లులపై చర్చ..సభ్యులకు సమయం..లోకేష్ ఫోన్ వినియోగంపై రభస
మండలిలో సర్వ శక్తులు ఒడ్డుతున్న టీడీపీ
మండలిలో టీడీపీ సర్వ శక్తులు ఒడ్డుతుంది. ఏపీకి మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దును మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తోంది. అందుకే శాసనసభలో అడ్డుకునే ప్రయత్నం చేసినా టీడీపీకి సభ్యుల బలం లేకపోవటంతో అక్కడ బిల్లు పాసైంది. ఇప్పుడు మండలిలో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది. సభ్యుల బలం మండలిలో ఉన్న నేపధ్యంలో వ్యూహాలు రచిస్తున్న టీడీపీ ఇందుకు రూల్ నెంబర్ 71ను తీసుకువచ్చింది. శాసనమండలిలో 32 మంది సభ్యులతో అడ్డుకునే ప్రయత్నం చేసింది.
టీడీపీ షాక్ ఇచ్చి వైసీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీలు
కానీ ఊహించని విధంగా ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్రెడ్డిలు టీడీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. శమంతకమణి, శత్రుచర్లలు అసలు సభకు రాలేదు . ఫలితంగా 27 మంది సభ్యులే టీడీపీకి మద్దతుగా నిలిచారు. అయినప్పటికే టీడీపీకి బలం ఉన్న నేపధ్యంలో బిల్లుల పై ఓటింగ్ జరగకముందే రూల్ 71 ప్రకారం ప్రభుత్వానికి మెజార్టీ లేదని తేల్చేసింది.
నిన్న రూల్ నెంబర్ 71.. నేడు సెలెక్ట్ కమిటీ టీడీపీ అస్త్రాలు
రూల్ నెంబర్ 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ బిల్లులపై చర్చను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఒకవేళ చర్చ జరిగినా బిల్లులు ఆమోదం పొందకుండా ఆపటం కోసం సెలెక్ట్ కమిటీకి బిల్లులు పరిశీలనకు పంపాలని వ్యూహాన్ని సిద్ధం చేసింది . మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ కు ఒక లేఖ అందించింది. అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని కోరింది. సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణలను ప్రతిపాదించింది.
సవరణలకు ప్రతిపాదించిన టీడీపీ .. ఇరకాటంలో వైసీపీ
ఇలా సవరణలు చేసి పంపిన బిల్లులు అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ శాసన మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక అంతే సంగతులు అంటున్నారు విశ్లేషకులు . సెలెక్ట్ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గే వీలుంది. టీడీపీ కోరినట్లుగా ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపితే మాత్రం జాప్యం జరగటం ఖాయం సెలెక్ట్ కమిటీలో శాసనసభ, శాసనమండలి సభ్యులలో ఎవరినైనా ప్రభుత్వం ఎంపిక చేయవచ్చు. పార్టీకి ఒకరినైనా లేక ఇద్దరినైనా తీసుకోవచ్చు. అధికార, విపక్ష కమిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
సెలెక్ట్ కమిటీ ముందుకు బిల్లులు వెళ్తే మూడు రాజధానుల ఏర్పాటు మరింత జాప్యం
ఆ కమిటీ ఈ బిల్లులను ముందుగా పరిశీలిస్తుంది. బిల్లు ఆమోదం పొందితే ఆ తర్వాత పరిణామాలు, కాకపోతే పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, బిల్లు అమలు సాధ్యా సాధ్యాలను సెలెక్ట్ కమిటీ చర్చిస్తుంది. ఆ తర్వాత కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఈ పరిశీలనకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ ఈ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. ఈ బిల్లులు ఆమోదం పొందలేవు కాబట్టి వీటిని ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. అదే జరిగితే మూడు రాజధానుల మార్పుకు కొంతకాలం బ్రేకులు పడే అవకాశం ఉంటుంది.