కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడా
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఎట్టకేలకు నేడు ప్రారంభమైంది. విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తో చెక్ పడినట్లయింది. నేటి నుండి కనకదుర్గ ఫ్లైఓవర్ పై వాహన రాకపోకలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎవరికి వారు కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ వాసులకు అందించిన ఘనత తమదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి ఎవరి వాదన వారు వినిపిస్తుంటే, టీడీపీ నేతలు విజయవాడకు కనకదుర్గ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన ఘనత తమదే అని చెప్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ క్రెడిట్ అంతా మోడీ సర్కార్ దే అంటూ కితాబిచ్చుకుంటుంది.
కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ , సీఎం జగన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
తన అభ్యర్ధన మేరకే ఇదంతా జరిగిందన్న కేశినేని నానీ
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, విజయవాడ మచిలీపట్నం నాలుగు వరసల రహదారి ప్రారంభోత్సవం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన అభ్యర్థనను మన్నించి నేడు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ , విజయవాడ మచిలీపట్నం నాలుగు వరసల రహదారి ప్రారంభోత్సవం, 2600 కోట్ల రూపాయల విజయవాడ బైపాస్,బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పడమర భాగం శంకుస్థాపన కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా తన అభ్యర్థన మేరకే జరిగినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దుర్గ గుడి ఫ్లైఓవర్ కోసం పోరాటాలు చేసి సాధించిన ఘనత టీడీపీదే
దుర్గ గుడి ఫ్లైఓవర్ కోసం టిడిపి అనేక పోరాటాలు చేసిందని ఎంపీ కేశినేని నాని తెలిపారు .విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ అద్భుతమైన కట్టడం అని పేర్కొన్న ఆయన టీడీపీ హయాంలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. ఏపీలో అధికార పార్టీ ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్ట్ ను కూడా తీసుకు రాలేదని విమర్శించారు. తన అభ్యర్థన మేరకే 6 వేల కోట్ల పనులు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు కేశినేని నాని. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ తీసుకువచ్చిన ఘనత తమ పార్టీదేనని బల్లగుద్ది మరీ చెప్పారు. కనక దుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలు చేసిందని ఆయన గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ ను టిడిపి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు.
టీడీపీ చేతగాక వదిలేస్తే సీఎం జగన్ ఫ్లైఓవర్ నిర్మాణం చేశారన్న విజయసాయి
ఇదిలా ఉంటే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం కావడం సంతోషకర పరిణామమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన సీఎం తో పాటుగా కేంద్ర పెద్దలకు , అధికారులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. 2016 కృష్ణా పుష్కరాల కు ముందే దుర్గగుడి ఫ్లై ఓవర్ కట్టిస్తాం అని ప్రగల్బాలు పలికి, చేతగాక వదిలేసిన వారు కూడా ఆనంద పడవచ్చు అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ ని పూర్తి చెయ్యలేక టిడిపి చేతులెత్తేస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
Recommended Video
కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే అంటున్న బీజేపీ
ఇదిలా ఉంటే కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, నిధులిచ్చి, నిర్మాణం పూర్తయ్యేలా చేసింది, ఈరోజు అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. విజయవాడ వాసుల కల సాకారం అయిందని, కనకదుర్గ ఫ్లైఓవర్ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం, ఏపీ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పడం అందుకు ఉదాహరణ. కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ ను అటు ఏపీ లోని అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపి లతోపాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీపడుతోంది.