సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి: అవినాశ్ తో సహా ఆ నేతలు: ఇదే ముహూర్తం..పక్కా వ్యూహాత్మకంగా..!
తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినావ్ వైసీపీలో చేరటం ఖాయమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన ఈ సాయంత్రం వైసీపీలో అధికారికంగా చేరనున్నారు. గతంలోనే అవినాశ్ వైసీపీలోకి వస్తారని ప్రచారం సాగినా..ఆయన ఖండించారు. ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న సమయంలో..వైసీపీ వ్యూహాత్మకంగా అదే పార్టీకి చెందిన యువత అధ్యక్షుడిని తమ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీని మీద అవినాశ్ తన తండ్రి అనుచరులు..తన సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత వైసీపీలో చేరాలని అనుచరుల ఒత్తిడితో చివరకు ముహూర్తం ఖరారు చేసారు. టీడీపీలో ప్రాధాన్యత దక్కటం లేదనే కారణంగానే ఆయన పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అవినాశ్ కు వైసీపీలో దక్కే ప్రాధాన్యత ఏంటనే దాని పైన చర్చ మొదలైంది. అవినాశ్ కు వైసీపీ విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అదే సమయంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నెహ్రూ అనుచరులు సైతం వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!
టీడీపీలో ప్రాధాన్యత దక్కటం లేదంటూ..
కొద్ది రోజులుగా దేవినేని అవినాశ్ టీడీపీలో మనస్పూర్తిగా పని చేయటం లేదు. పార్టీలో కొందరి వైఖరి కారణంగా ఆయన మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ నేతలు అవినాశ్ తో టచ్ లోకి వెళ్లారు. పార్టీలోకి వస్తే దక్కే ప్రాధాన్యత గురించి వివరించారు. దీంతో..అవినాశ్ రెండు రోజులు ఇదే అంశం పైన తన ముఖ్య సన్నిహితులతో చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు తన తండ్రి నెహ్రూ తో కలిసి పని చేసిన నేతలు..అనుచరులతో కలిసి గుణదలలో సమావేశం ఏర్పాటు చేసారు. టీడీపీలో ప్రాధాన్యత లేనప్పుడు ఉండాల్సిన అవసరం లేదని..వైసీపీలోకి వెళ్లటం తప్పు కాదని మెజార్టీ అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో..ఆయన ఇక టీడీపీ వీడాలని నిర్ణయించారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అవినాశ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అవినాశ్ టీడీపీ నుండి గుడివాడ అభ్యర్ధిగా కొడాలి నాని మీద పోటీ చేసారు.
వైసీపీలో ఏ హామీ లభించింది...
తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేస్తున్న దేవినేని అవినాశ్ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత..అంతకు ముందు ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని అనేక నిరసనలు నిర్వహించారు. టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనే వారు. అయితే, కొంత కాలంగా మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటం లేదు. ఆయన కొద్ది కాలం క్రితమే పార్టీ వీడుతారనే ప్రచారం సాగినా..అవినాశ్ ఖండించారు. ఇక, ఇప్పుడు మాత్రం ఇక టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయానికి వచ్చారు. వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చిన సందర్భంలోనే ఆయనకు స్పష్టమూన హామీ లభించినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే నగరంలో టీడీపీ గెలిచింది. ఇప్పుడు అక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతలను అవినాశ్ కు అప్పగించే విధంగా హామీ లభించినట్లు చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో తమ కుటుంబానికి పట్టు ఉండటంతో..అవినాశ్ సైతం తన రాజకీయ భవిష్యత్ ను పరిగణలోకి తీసుకొని పార్టీ మారుతన్నట్లుగా తెలుస్తోంది.
జగన్ సమక్షంలో..బాబు దీక్ష వేళ..
ఇక టీడీపీ అధినేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో దీక్ష చేస్తున్న సమయంలోనే..ఆ పార్టీ యువనేతను ఆయన అనుచరులతో సహా పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా వ్యూహాత్మకంగానే ఈ ముహూర్తం ఖరారు చేసింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో దేవినేని అవినాశ్ తన తండ్రి అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లుగా సమాచారం. అందులో కడియాల బుచ్చిబాబు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..అవినాశ్ పార్టీ మారకుండా టీడీపీ చివరి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో..అవినాశ్ టీడీపీకి ఇంకా అధికారికంగా రాజీనామా చేయలేదు. ఇప్పుడు అవినాశ్ వైసీపీలో చేరాలనే నిర్ణయం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.