వైసీపీలో దేవినేని అవినాశ్..! అనుచరులతో భేటీ..ఒత్తిడి: చంద్రబాబు దీక్ష వేళ షాక్...!
ఇసుక వ్యవహారం పైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి జలక్ ఇవ్వాలని భావించిన టీడీపీకి..అధికార వైసీపీ రివర్స్ షాక్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు దీక్ష సమయంలో టీడీపీ యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పార్టీ వీడాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడలో చంద్రబాబు దీక్షకు జిల్లా నేతలు బీజీగా ఉండగా..అవినాశ్ మాత్రం ఆ ఏర్పాట్లలో పాల్గొనలేదు. చంద్రబాబు దీక్ష చేస్తున్న జిల్లా నుండే షాక్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా దేవినేని అవినాశ్ తో మంతనాలు సాగించారు. విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..వైసీపీ నుండి వచ్చిన ఆఫర్ గురించి తన అనుచరులకు అవినాశ్ వివరించారు. టీడీపీలో ప్రాధాన్యత లేదని కార్యకర్తలు సైతం ఆక్రోశం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో..గురువారం అవినాశ్ టీడీపీకి రాజీనామా చేసి..సీఎం జగన్ ను కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ నేతలు ఎలాగైనా అవినాశ్ పార్టీ వీడకుండా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటూ ..పార్టీ మార్పుపై దేవినేని అవినాష్ క్లారిటీ ..
టీడీపీకి అవినాశ్ గుడ్ బై..
తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీకి గుడ్ బై చెప్పటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గుణదల లోని దేవినేని నెహ్రూ నివాసంలో నెహ్రు అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాటకు కట్టుబడి పనిచేసిన అవినాష్ కి తగిన న్యాయం పార్టీ లో జరగలేదని నెహ్రు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వకుండా నేతలు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయినట్లు సమాచారం. మెజార్టీ కార్యకర్తలు అందరూ పార్టీ మారాలని అవినాష్ పై తీవ్ర ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. న్యాయం జరగని టీడీపీ లో ఎంత కష్టపడి పనిచేసిన విలువ ఉండదని కార్యకర్తలు సూచన చేసారు. ఎంతోమంది కి రాజకీయ గురువు అయిన దేవినేని నెహ్రు కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం పై కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో.. ఇక టీడీపీని వీడాలని దేవినేని అవినాశ్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.
వైసీపీలోకి అవినాశ్..హామీ ఇదేనా..
టీడీపీ రాజీనామా చేస్తూనే..అవినాశ్ వైసీపీలో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నెహ్రూ అభిమానులు సైతం వైసీపీ లో చేరాలని సూచిస్తున్నారు. గతంలోనూ ఇదే విధంగా అవినాశ్ వైసీపీలో చేరుతారని ప్రచారం సాగినా..ఆయన ఖండించారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. అయితే, జిల్లా టీడీపీలో నెలకొన్ని పరిస్థితుల కారణంగా ఇక పార్టీలో ఉండలేనని అవినాశ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో..వైసీపీ నేతలు సైతం అవినాశ్ తో టచ్ లోకి వెళ్లి.. స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అవినాశ్ వైసీపీలో చేరితే విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించటానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు విశ్వస నీయ సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో అవినాశ్ గుడివాడ నుండి కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిపోయారు. గతంలో అవినాశ్ తండ్రి నెహ్రూ సైతం వైయస్సార్ తో సన్నిహితంగా ఉంటూ ఆయనతో కలిసి పని చేసారు. ఇక, ఇప్పుడు నెహ్రూ కుమారుడు..వైయస కుమారుడితో కలిసి పని చేయటానికి సిద్దమయ్యారని అభిమానులు చెబుతున్నారు.
చంద్రబాబు దీక్ష వేళ షాక్..
చంద్రబాబు ఇసుక అంశం పైన దీక్షకు నిర్ణయించారు. విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఈ దీక్ష జరగనుండి .అయితే విజయవాడకే చెందిన అవినాశ్ ఈ దీక్ష ఏర్పాట్లలో పాల్గొనలేదు. ఆయన పార్టీ మారే అంశం పైన తన అనుచరులు..తన తండ్రి అభిమానులతో సమావేశమయ్యారు. వారంతా కూడా అవినాశ్ పార్టీ మారటానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీక్షకు ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి..రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ నుండి వైసీపీతో టచ్ లో ఉన్న నేతలతో టీడీపీకి రాజీనామా చేయించి..రాజకీయంగా టీడీపీని ఆత్మరక్షణలో పడేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో..అటు చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలోనూ అవినాశ్ టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో..గురువారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.