వైసీపీ దళిత ఓటు బ్యాంకుపై టీడీపీ కన్ను- డాక్టర్లకు మద్దతు వెనుక బహుముఖ వ్యూహం... !
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? దళితులు సరైన దుస్తులు ధరించరు, మురికి పరిస్ధితుల్లో ఉంటారు.... ఐదేళ్లలో ఇలాంటి డైలాగులు టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని మంత్రులు, నేతల వరకూ వినిపించేవి. అప్పటికే కాంగ్రెస్ నుంచి వారసత్వంగా వైసీపీకి సంక్రమించిన దళిత వారసత్వం టీడీపీకి ఏనాడూ అండగా నిలవలేదన్న అసహనం అప్పట్లో బలంగా కనిపించేది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి వైసీపీ ఘనవిజయంతో అదే నిజమైని తేలిపోయింది. అయినా ఇప్పటికీ టీడీపీ దళితుల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.
దళిత ఓటు బ్యాంకు- టీడీపీ
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ దళితులు ఆ పార్టీకి అండగా ఉన్న సందర్భాలు ఒకటీ అరా మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే బీసీ, కమ్మ ఓటు బ్యాంకుతో ముందుకు సాగిన టీడీపీ... దళితుల విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవడానికి కారణమిదే. చివరికి జీఎంసీ బాలయోగిని ఏకంగా లోక్ సభ స్పీకర్ ను చేసినా దళితుల మద్దతు పొందడంలో టీడీపీ సక్సెస్ కాలేకపోయింది. ఎప్పుడు చూసినా ఒకటీ అరా విజయాలే తప్ప టీడీపీ ఎప్పుడూ పూర్తిగా దళితుల మద్దతు పొందలేకపోయింది. దీనికి చారిత్రకంగా చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అనుసరించిన వ్యూహాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తాయి.
గత ఐదేళ్లలో జరిగిందిదీ...
2014లో టీడీపీ స్వల్ప ఓట్ల మెజారిటీతో అధికారం చేపట్టిన తర్వాత కేబినెట్ కూర్పులో దళితులకు అవకాశం కల్పించింది. అయితే మధ్యలో విస్తరణలో భాగంగా రావెల కిషోర్ బాబును తప్పించారు. ఆ తర్వాత మంత్రిగా ఉన్న జవహర్ తో పాటు ప్రస్తుతం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనితను 2019 ఎన్నికల సందర్భంగా ఏకంగా నియోజకవర్గాలే మార్చేశారు. వారు మొదట్లో గెలిచిన కొవ్వూరు, పాయకరావుపేట స్ధానాల్లో టీడీపీలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేతలకు వీరు అడ్డుగా ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు దళిత నేతలపై అధినేత చంద్రబాబుతో పాటు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని చేసిన కామెంట్లు ఆ పార్టీకి ఉన్న కాస్తో కూస్తో దళిత ఓటు బ్యాంకును కూడా దూరం చేసేశాయి. చివరికి ప్రకాశం జిల్లా కొండెపిలో స్వామి మినహా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేను కూడా టీడీపీ గెలిపించుకోలేకపోయింది.
మారిన వ్యూహం-దళిత మంత్రం...
టీడీపీకి ఆవిర్భావం నుంచి అండగా నిలబడిన బీసీలు తొలిసారిగా ఆ పార్టీకి పూర్తిగా దూరమైపోయారు. చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి, వైసీపీ ఓటమికి మధ్య అడ్డుగోడగా నిలిచిన బీసీలు... మారిన పరిస్ధితుల్లో ప్లేటు ఫిరాయించారు. దీంతో టీడీపీ ఎన్నడూ లేనంత దారుణమైన స్ధాయిలో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే బీసీలు దూరం కావడంతో తిరిగి అంతే స్దాయిలో ఉన్న మరో ఓటు బ్యాంకుపై టీడీపీ దృష్టిపెట్టాల్సిన పరిస్దితులు ఏర్పడ్డాయి. కానీ బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీకి అండగా ఉంది. దీన్ని అధికార పార్టీకి దూరం చేయడం అంత సులువేమీ కాదు. అందుకే క్రమంగా చిన్న చిన్న అంశాలను హైలెట్ చేయడం ద్వారా వైసీపీకి దళితులను దూరం చేయాలని టీడీపీ భావిస్తోంది.
డాక్టర్లకు మద్దతు వెనుక అసలు విషయమిదే...
గతేడాది వైసీపీ హవాలో దారుణ ఓటమి పాలైన టీడీపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ సర్కారుపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో దళితుల అంశం కూడా ఒకటి. విశాఖలో పీపీఈ కిట్ల కొరతపై ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ కు అండగా నిలవడం ద్వారా ఆయన్ను ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఉసిగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అండతోనే సుధాకర్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా... ప్రభుత్వంపై, ప్రభుత్వాధినేతపై తీవ్ర ఆరోపణలు, దుర్భాషలకు దిగినట్లు తెలుస్తోంది. మొదట్లో దీన్ని చిన్న విషయంగానే పరిగణించిన వైసీపీ నేతలు.. ఆయనపై సస్పెన్షన్ తోనే సరిపెట్టారు. కానీ టీడీపీ అండగా ఉందని తెలిసిన తర్వాత ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చడం, కేసులు నమోదు చేసే దాకా వెళ్లారు. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టు చొరవతో సీబీఐ విచారణ వరకూ వెళ్లిపోయింది. ఇదే కోవలో తాజాగా చిత్తూరు డాక్టర్ అనితారాణి వ్యవహారంలోనూ అంత తీవ్రత లేకపోయినా టీడీపీ నేత వంగలపూడి అనిత రోజూ అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం కూడా మర్చిపోయి పార్టీ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఈ కేసును కూడా సుధాకర్ వ్యవహారంలాగే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు పెట్టాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
సుధాకర్ వ్యవహారంతో వైసీపీ అప్రమత్తం...
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల జోక్యం లేనప్పటికీ కేసు సీబీఐకి అప్పగింత వరకూ వెళ్లడంతో ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలైంది. ఓ చిన్నస్దాయి దళిత డాక్టర్ ను టార్గెట్ చేశారన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తాజాగా బయటపడిన మరో దళిత డాక్టర్ అనితారాణి వ్యవహారంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆరోపణలు రాగానే సీఐడీ విచారణకు ఆదేశించడమే కాకుండా మహిళా కమిషన్లో సుమోటో కేసు కూడా నమోదు చేయడం ద్వారా తాము పారదర్శకంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో టీడీపీ కూడా ప్రతీ రోజూ అనితారాణి వ్యవహారాన్ని హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎంత వరకూ మైలేజ్ ఇస్తుందో తెలియకపోయినా దళితులకు టీడీపీ అండగా ఉందన్న మెసేజ్ పంపేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.