ఇంకా ఉద్రిక్తంగానే అంతర్వేది- సోము వీర్రాజు సహా బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్ట్...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగులబడిన ఘటన తీవ్ర ఉద్రికతలకు కారణమవుతోంది. ఈ ఘటనను హిందూ సంఘాలు సీరియస్గా తీసుకోవడంతో నిన్న రాష్ట్ర మంత్రులకు సైతం సెగ తప్పలేదు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ ఇవాళ అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు.
నిన్న మంత్రులను వీహెచ్పీ, హిందూ సంఘాల నేతలు అడ్డుకున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చారు. దీంతో అంతర్వేదిలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరెస్సెస్, విశ్వహిందూపరిషత్, బీజేపీ, జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కార్యకర్తలను సైతం బైండోవర్ చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతర్వేది చుట్టు పక్కన ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత పెంచారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నారు.
మరోవైపు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్రావు ప్రకటించారు. అంతర్వేది ఆలయంలో ఫోరెన్సిక్ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంతర్వేది ఆలయ పరిసరాల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, బయటి ప్రాంతాల వారు ఇక్కడికి రావడంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని డీజీఐ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.