రేపే ఏపీ క్యాబినెట్..! పెండింగ్ లో ఉన్న పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయం..!!
అమరావతి/ హైదరాబాద్ : ఏపి లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకోసం ఏ కార్యక్రమాలు కూడా పెండింగ్ లో ఉండకూడదని ఏపి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాడంగా ప్రభుత్వ పనితీరులో వేగం పెంచాలని నిర్ణయించింది. అంతే కాకుండా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సీయం అధ్యక్షతన రేపు బుధవారం ఉదయం 8 గంటలకు అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగుతుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఖాళీ అవబోతున్న స్థానిక సంస్ధలు, పట్టభద్రులు, ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్ధానాలకు 14వ తేదీ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒకవేళ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వస్తుంది. అయితే ఈ ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉండగానే సార్వత్రిక ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతో ఇక మరో రెండు నెలల పాటు ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉండే పరిస్ధితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబందించి పెండింగ్ లోఉన్న పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే రేపు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ క్యాబినేట్ భేటీలో పలు ప్రజాకర్షక పథకాలకు ఆమోదం తెలపనున్నారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిని కార్యక్రమాలకు కూడా ఓ రూపం వచ్చే అవకాశాలు ఈ మంత్రి వర్గ సమావేశంలో కనిపిస్తున్నాయి.