అమ్మ నారాయణో..! అన్ని వేల ఎకరాలా..? వైసిపి నేతల ఆరోపణల ప్రకారం సగం భూములు దున్నేసాడుగా...!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో వాడివేడిగా సాగుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విధానాలపై వైసీపి ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కృష్ణా కరకట్ట మీద అక్రమ నిర్మాణాల కూల్చివేతల దగ్గర నుండి పోలవరం, రాజధాని నిర్మాణం, రాజధాని భూములు తదితర అంశాల్లో తప్పులు జరిగాయని వైసిపి ప్రభుత్వం ప్రధాన ఆరోపణలు చేస్తోంది. అదికారాన్ని అడ్డుపెట్టుకుని టీడిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఏపి ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాజధాని భూముల వ్యవహారం నిగ్గు తేలాల్సిందే అని కొంత మంది వైసీపి నేతలు పట్టు బట్టడం కొసమెరుపు.
రాజధాని భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్..! నిగ్గు తేలాల్సిందే అంటున్న వైసీపి..!!
ముఖ్యంగా రాజధాని భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఆ వ్యవహారమంతా బహిర్గతం కావాలని, టీడిపి అదికారంలో ఉన్నప్పుడు, ఏ మంత్రి ఎన్ని వేల భూములు బినామీ పేర్లతో కొన్నారో తేటతెల్లం కావాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వాఖ్యల పట్ల ఎంత రాజకీయ దుమారం రేగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదని తెలుస్తోంది. రాజధాని భూముల్లో ఎవరి వాటా ఎంతుదన్నే అంశం తేలిన తర్వాతే సీఎం స్థాయిలో ప్రకటన ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడిపి హయాంలో మున్సిపల్ శాఖా మంత్రిగా పనిచేసిన నారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల భూములు బినామీ పేర్లతో కొనుగోలు చేసారనే ఆరోపణ తాజాగా వినిపిస్తోంది. దీనిపై మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధినేత వివరణ ఇవ్వాల్సి ఉంది.
బీజేపీలో అరవింద్ కు ఘోర అవమానం .. ఢిల్లీ పెద్దల ఆరా .. అసలేం జరిగింది
దుమారం లేపుతున్న బొత్స వ్యాఖ్యలు..! సీఎం వ్యూహాత్మక నిశ్వబ్దం..!!
ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని, నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం చేసిన ప్రతి విమర్శను గుర్తుపెట్టుకుని ప్రతీకార రాజకీయాలు చేస్తోంది. అయితే, తెలుగుదేశం గతంలో మాటలతో వదిలేస్తే వైసీపీ చేతల్లో తన సత్తా ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తోంది. రాజధాని భూముల్లో తెలుగుదేశం నేతలను ఇరికించడానికి వైసీపీ ప్రయత్నంచేస్తోంది. ముందుగా మంత్రి బొత్స రాజధాని మంట రాజేశాక, విజయసాయిరెడ్డి రకరకాల విమర్శలతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. ఇక చిన్నా చితకా నాయకులు, ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా విభాగం, అందరూ ఒక పద్ధతి ప్రకారం కార్నర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, వైసీపి నేతలు భూతద్దంలో వెతికినా ఒక్క రూపాయి అవినీతిని కూడా కనిపెట్టలేరని వివరించారు. అమరావతిలో భూముల క్రయ విక్రయాలు జరగలేదని, లాండ్ పూలింగ్ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చారు.
బొత్స వ్యాఖ్యల వెనక అంతరార్ధం వేరు..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!
ఇదిలా ఉండగా, బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేత సుజన చౌదరితో పాటు పలువురిపై భూ కుంభకోణ ఆరోపనలు చేశారు విజయసాయిరెడ్డి. మరోవైపు బొత్స కూడా సుజనతో పాటు టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. ఏ కంపెనీల పేరిట సుజనకు ఎక్కడ భూములున్నాయో బొత్స ఆధారాలతో లెక్కలు వేసి మరీ వివరించారు. ఒక్కో వైసీపీ నేత తమదైన శైలిలో తెలుగుదేశం నేతలను టార్గెట్ చేశారు. తెలుగుదేశం నేతలు మాత్రం మీరు ఎలా అయినా విచారణ చేసుకోండి. అక్రమాలపై చర్య తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మాకేమీ అక్రమ భూముల్లేవు అని బల్లగుద్ది చెబుతున్నారు. రాజధానిని నాశనం చేసి, ఏపీని అల్లకల్లోలం చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు.
మాజీ మంత్రి నారాయణకు వేల ఎకరాలు..! వివరణ ఇవ్వాలంటున్న వైసీపి నేతలు..!!
ఇదిలా ఉండగా... తాజాగా ఏపీ మాజీ మంత్రి నారాయణకు అమరావతిలో అత్యధికంగా భూములు ఉన్నాయని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి తాజాగా ఆరోపించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. దీనిపై చర్చించేదుకు తాను రెడీ అన్నారు. నారాయణకు మాత్రమే 3 వేల ఎకరాల భూములు అమరావతిలో ఉన్నాయని, వాటి విలువ పది వేల కోట్ల రూపాయలు అని రవి ఆరోపించారు. రవి ఆరోపణల పట్ల మాజీ మంత్రి నారాయణ ఇంత వరకూ ఎక్కడా స్పందించలేదు. రవి ఆరోపణల పట్ల నారాయణ రియాక్ట్ అవుతారా లేక సైలెంట్ గా ఉంటారా అనే అంశం మాత్రం ఉత్కంఠ నెలకొంది.