మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు..బెదిరింపు ఫిర్యాదులు
టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై కేసు నమోదైంది. దేవినేని ఉమాకు జక్కంపూడి, షాబాద్ కు చెందిన పలువురు షాక్ ఇచ్చారు. జక్కంపూడి లో టిడిపి నాయకులు టిడ్కో గృహాలను పరిశీలించేందుకు వెళ్ళిన క్రమంలో దేవినేని ఉమ తో వాగ్వాదానికి దిగిన వారు తమను దేవినేని ఉమామహేశ్వరరావు బెదిరించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . షాబాద్ గ్రామస్థులు చేసిన ఫిర్యాదు మేరకు దేవినేని ఉమా పై పోలీసులు ఐపీసీ 504, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
టిడ్కో గృహాలను పరిశీలించేందుకు వెళ్ళిన ఉమాను అడ్డుకున్న గ్రామస్తులు .. వాగ్వాదం
గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించడానికి వెళ్ళిన దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ ఆందోళన చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో కొందరు గ్రామస్తులు మాజీమంత్రి దేవినేని ఉమా తో వాగ్వాదానికి దిగారు. టిడిపి హయాంలోనే పేదలకు అన్యాయం జరిగిందని, మా దగ్గర నుండి భూములు తీసుకుని మాకు ఇల్లు ఇవ్వకుండా విజయవాడలో ఉండేవాళ్ళకి ఇచ్చారంటూ దేవినేని ఉమని ప్రశ్నించారు స్థానికులు. న్యాయం చేస్తామని మాట ఇచ్చి భూముల తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ దేవినేని ఉమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఉమా ఫైర్
టిడ్కో గృహాల పరిశీలనకు వెళ్ళిన ఉమా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు . జక్కంపూడి, షాబాద్ గ్రామాలలో టిడ్కో గృహాల పరిశీలనకు వెళ్లిన తమను వైసిపి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తమపై దుర్భాషలాడారని , కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలు ముందు బైఠాయించిన దేవినేని ఉమా శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇక ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అంటూ ప్రశ్నించారు.
నిరసన తెలిపేందుకు వస్తే రౌడీయిజం చేశారని మండిపాటు
నిరసన తెలపటానికి వస్తే రౌడీయిజం చేయడం దారుణమని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పులివెందుల రాజకీయాలు నడపడం దారుణమని పేర్కొన్న దేవినేని ఉమా ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కు లేదా ? అంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా దేవినేని ఉమా టిడ్కో గృహాల పరిశీలన నేపథ్యంలో ఊహించని విధంగా దేవినేని ఉమా తమను బెదిరించారు అంటూ షాబాద్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .