ఆ ముగ్గురు నేరస్థులు.. కేసులు లేని మరో ఇద్దరు .. అందరు కలిసి రెచ్చిపోయారుగా..!
విజయవాడ : ఆ ముగ్గురు నేరస్థులే. వివిధ నేరాల కారణంగా జైలుశిక్ష అనుభవించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కానీ జైలులో పరిచయం ఆ ముగ్గురినీ ఒక్కటిగా చేసింది. బయటకు వచ్చాక సింగిల్గా నేరాలు చేయడమేంటి.. ముగ్గరం కలిస్తే మరింత దోచుకోవచ్చని ప్లాన్ చేశారు. ఆ క్రమంలో నేరాలతో సంబంధం లేని మరో ఇద్దరిని తోడు చేసుకున్నారు. అలా ఐదుగురు కలిసి రెచ్చిపోయారు. దొంగతనాలు చేస్తూ అందినకాడికి దండుకున్నారు. కృష్ణా జిల్లాలో పలు చోరీలకు పాల్పడి చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.
జైల్లో పరిచయం.. బయటకొచ్చి ఒక్కటయ్యారు..!
తమిళనాడు దిండిగల్ జిల్లా తాడిగొంబుకు చెందిన 38 సంవత్సరాల మారిముత్తు, కృష్ణాజిల్లా ఘంటసాలకు చెందిన 35 ఏళ్ల మామిళ్లపల్లి శశిధర్, భవానీపురానికి చెందిన 27 ఏళ్ల నామాల నాగరాజు పాత నేరస్థులు. వీరంతా గతంలో వివిధ నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించారు. అయితే జైలు నుంచి బయటకొచ్చాక ఈ ముగ్గురు కాస్తా ఒక్కటయ్యారు.
అంతేకాదు ఇదివరకు ఏ నేరాలతో సంబంధం లేని మరో ఇద్దరిని వీరి ముఠాలో చేర్చుకున్నారు. 28 ఏళ్ల బాణావత్ సురేశ్, 25 ఏళ్ల దొడ్డాక గోవర్ధన్.. ఈ ముగ్గురితో జత కట్టారు. అలా ఐదుగురు కలిసి కొత్త నేరాలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కి కటాకటాలపాలయ్యారు.
ఆ ముగ్గురు నేరస్థులు.. మరో ఇద్దరిపై కేసులు లేవు.. కానీ అందరు కలిసి..!
మామిళ్లపల్లి శశిధర్ ఇళ్లు గుల్ల చేయడంలో దిట్ట. ఎంతటి తాళమైనా ఇట్టే విరగ్గొట్టేస్తాడు. ఇతడిపై 10 కేసుల వరకు నమోదయ్యాయి. గుంటూరు, తెనాలి, నిడదవోలు తదితర పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉన్నాడు. అయితే గుంటూరులో ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. అక్కడ తమిళనాడుకు చెందిన మారిముత్తుతో పరిచయమైంది.
ఇక నామాల నాగరాజు చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడు. అలా అతడిపై మొత్తం 7 కేసుల వరకు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం, భవనీపురం తదితర పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉన్నాడు. అదలావుంటే ఐదుగురి ముఠాకు నేతృత్వం వహించిన మారిముత్తుపై ఒకే ఒక్క కేసు ఉండటం గమనార్హం.
కార్లు దొంగతనాలు చేయడమే లక్ష్యంగా..!
ఆ ముగ్గురు జైలు నుంచి బయటకొచ్చాక ముఠాగా ఏర్పడ్డారు. ఏ నేరాలు చేయని మరో ఇద్దరితో జతకట్టి ఐదుగురు చోరీలు చేయాలని పథకం వేశారు. అయితే కార్లు దొంగతనాలు చేయాలనేది వీరి పథకం. ఆ క్రమంలో ముందుగా టూ వీలర్స్ను చోరీ చేసేవారు. లాక్ చేసి ఉన్న బండ్లను దొంగిలించేవారు. హ్యాండిల్ను బలవంతంగా వంచి తాళం విరగ్గొట్టి ఆ బైకులపై పరారయ్యేవారు.
అవే టూ వీలర్స్పై ఐదుగురు కలిసి కాలనీల్లో తిరుగుతూ కార్లను గుర్తించేవారు. కార్లను దొంగిలించే ముందు రెక్కీ నిర్వహించేవారు. చోరీ చేయాలనుకున్న కారు దగ్గర ముగ్గురుండి మిగతా ఇద్దరు చెరో బైకు మీద వెళ్లిపోయేవారు. కారు దగ్గర తచ్చాడే ఆ ముగ్గురు అదను చూసి అద్దాలు పగులగొట్టి లోనికి ఒకడు వెళ్లేవాడు. అనంతరం కొన్ని వైర్లు కట్ చేసి కారుతో ఉడాయించేవారు.
చివరకు చిక్కారిలా..!
జైలు పరిచయంతో బయటకొచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. కృష్ణా, చిత్తూరు జిల్లాలతో పాటు యానాం తదితర ప్రాంతాల్లో మొత్తం పది కార్ల వరకు దొంగిలించారు. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగి నిఘా పెంచారు. అదే క్రమంలో పలు ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజ్ పరిశీలించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. భవానీపురంలో శనివారం నాడు కాపు కాసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.