బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?
అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వ్యవహారం.. భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమికి సవాల్ విసురుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరిన తరువాత ఎదురైన తొలి ఎన్నిక కావడం.. అదీ లోక్సభ కావడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బీజేపీ-జనసేన మాత్రం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యానికి తిరుపతి ఉప ఎన్నికను తొలి అడుగుగా భావిస్తున్నాయి. లక్ష్యం ఎలా ఉన్నా.. తొలి అడుగే తడబడేలా కనిపిస్తోంది.
Recommended Video
పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు
ఎవరు పోటీ చేయాలి?
ఈ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై బీజేపీ-జనసేన ఏకాభిప్రాయానికి రాలేకపోతోన్నాయి. రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే కావడంతో బరిలో ఎవరు నిల్చోవాలనేది తేల్చుకోలేకపోతోన్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ చాలా రోజుల కిందటే ప్రారంభించింది కూడా. బీజేపీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ స్వయంగా మకాం వేశారు. బీజేపీ అనుబంధ సంఘాలు, చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశమౌతోన్నారు. పార్టీ రాష్ట్రశాఖ యంత్రాంగం మొత్తం తిరుపతి ఉప ఎన్నిక మీదే దృష్టి సారించింది.
గ్రేటర్ హైదరాబాద్కు పరిహారంగా..
తిరుపతి ఉప ఎన్నికలో తామే పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకొని మిత్రపక్షం బీజేపీకి మద్దతు ఇచ్చినందున దానికి పరిహారంగా తిరుపతి లోక్సభ స్థానాన్ని కోరుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే. బీజేపీకి ఇలా వరుసగా అవకాశాలను ఇచ్చుకుంటూ పోతే.. తమ పార్టీ పరిస్థితేమిటనే అభిప్రాయాలు జనసేనలో బలంగా వినిపిస్తున్నాయి. తిరుపతి వేదికగా ఇటీవలే ముగిసిన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలోనూ దీన్నే ప్రస్తావించారు నేతలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానంలో బీజేపీ కంటే అధిక ఓట్లను సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
బీజేపీ వదులుకుంటుందా?
తిరుపతి లోక్సభ స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు వదులుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు కమలనాథులు. గ్రేటర్ హైదరాబాద్తో దీన్ని పోల్చుకోవడానికీ ఇష్ట పడట్లేదు. దానికి అదే.. దీనికి ఇదే అనే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. నిజానికి- తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉంది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించారు. ఆ తరువాత అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అందుకే- తాము పోటీ చేసి ఓటుబ్యాంకును మెరుగుపర్చుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగామనే సందేశాన్ని ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్-సోము వీర్రాజు మధ్య
ఈ పరిస్థితుల మధ్య బీజేనీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు..ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయం మీదే ప్రధాన చర్చ సాగింది. రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాల గురించి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. సోము వీర్రాజుకు వివరించారు. ఏ పార్టీ పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం మీదే వదిలేద్దామని సోము వీర్రాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎవరు పోటీ చేసినా.. ఉమ్మడి అభ్యర్ధిగా భావిస్తామని ఆయన స్పష్టం చేశారు.