నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!
అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగే పెన్షన్ల పండుగ, గృహ ప్రవేశాలు, డ్వాక్రా చెక్కులు పంపిణీపై తదితర అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపులుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఓటాన్ అకౌంట్ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు క్యాబినేట్ ఆమోదిస్తుంది.
అదేవిధంగా ప్రత్యక హోదా, విభజన హామీల అమలుకు ప్రభుత్వం చేపట్టే నిరసన కార్యక్రమాలపై కూడా ఈ క్యాబినేట్ భేటీలో చర్చ జరగనుంది. అలాగే చుక్కల భూముల ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా గవర్నర్ తిరస్కరించడంతో ఆ ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఈ అంశంపై కూడా క్యాబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద పదివేల రూపాయలు అందించడంపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లింపు అంశం కూడా క్యాబినేట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.