బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....
బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది విజయవంతంగా పూర్తయితే ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లైఓవర్పై లోడ్ టెస్ట్ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్ రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరప్పాడు రింగ్రోడ్డు మీదగా జాతీయ రహదారి 65 మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు.
ఇప్పటికే ఫ్లైఓవర్ పనులు 98శాతం మేర పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో లోడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు నిర్వహించనున్న లోడ్ టెస్టులో... 24 లారీల్లో ఇసుక లేదా కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును ఉంచి... ఫ్లైఓవర్పై స్పాన్ల మధ్య ఉంచుతారు. అలా 48 గంటలు పరిశీలించాక... ఏవైనా లోపాలు తలెత్తితే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్దారించుకున్నాక ట్రయల్ రన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.