ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Recommended Video
సచివాలయంలో కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో రోజువారీ విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. వీరి నుంచి కొందరికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో వారంతా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాజాగా సచివాలయంలో కొందరు ఉద్యోగులకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.