ఒకే వేదిక మీదకు ఇద్దరు బద్ద శత్రువులు..! రసవత్తరంగా మారనున్న బెజవాడ రాజకీయం..!!
అమరావతి/ హైదరాబాద్ : ఇద్దరు శత్రువులు ఒకే వేదికను పంచుకోలేరు. పంచుకున్నా కలిసి పని చేయడం చాలా కష్టం. అలా చేయాల్సిన పరిస్థితులు వస్తే వారిని ముందుండి నడింపించే వారి సమర్ధతకు గట్టి పరీక్ష ఎదురైనట్లే అవుతుంది. ఇప్పుడే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎదురవ్వబోతుంది. దీనికి కారణం వైసీపి కి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరుతుండడమే..! అదే టీడిపిలో ఇటీవలే తెలుగు యువత అద్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన దేవినేని అవినాష్, వంగవీటి రాధా బద్ద శత్రువులుగా బెజవాడ లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతూ కొత్త చరిత్రను రాయబోతున్నారు.
టిడిపిలోకే వంగవీటి రాధా : ముహూర్తం ఖరారు : 26వ తేదీ సాయంత్రం బాబు సమక్షంలో..!
బెజవాడలో రక్త చరిత్రను తలపించిన ఆ కుటుంబాలు..! ఇప్పుడు ఒకే పార్టీలోకి..!!
తనకు పార్టీలో సుముచిత స్థానం కల్పించకపోగా, వచ్చే ఎన్నికల్లో కోరిన టికెట్ ఇవ్వలేదనే కారణంతో చాలా రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన రాధా.. గత ఆదివారం వైసీపీకి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉండిపోయిన ఆయన.. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతా అనుకున్నట్లు తాను ఏ పార్టీలో చేరుతాడో మాత్రం వెల్లడించలేదు. కేవలం వైసీపీని ఎందుకు వీడాడో మాత్రమే వివరించారు.
ఒకే ఒరలో రెండు కత్తులు..! చంద్రబాబుకు కత్తి మీద సామే..!!
వాస్తవానికి రాధాకృష్ణ స్వయంగా ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, 25న టీడీపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఓ ప్రశ్న వేధిస్తోంది. ఎన్నో ఏళ్లుగా శత్రుత్వం ఉన్న వంగవీటి, దేవినేని నెహ్రూ కుటుంబాలు ఒకే పార్టీలో ఇమడగలవా అని. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వంగవీటి రంగా హత్యానంతరం వీరి మధ్య శత్రుత్వం పెరిగిపోయింది.
వంగవీటి రాధా టీడిపిలోకి..! కలవరపడుతున్న రంగా అభిమానులు..!!
కారణాలు ఏమైతే ఈ రెండు కుటుంబాల మద్య వైరం తారా స్థాయిలో ఉంటుందనేది రాష్ట్రంలోని అందరికీ తెలిసిన విషయమే. మరి వంగవీటి రాధా టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటి..? వంగవీటి రంగా హత్యానంతరం వంగవీటి రంగా భార్య, ఆయన తనయుడు కాంగ్రెస్లోనే కొనసాగుతూ వచ్చారు. అప్పట్లో టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ కుటుంబం, చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆ తరువాత కాంగ్రెస్లో చేరింది. అలా వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ ఇద్దరూ 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైఎస్ హయాంలో ఈ రెండు కుటుంబాలను కాంగ్రెస్ బాగానే బ్యాలెన్స్ చేసింది.
బాబు కనుసన్నల్లో దేవినేని కుటుంబం..! కథ సుఖాంతం అయ్యే ఛాన్స్..!!
2009లో వంగవీటి రాధా చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్లో కొనసాగిన దేవినేని నెహ్రూ కూడా 2009, 2014లో ఓటమి పాలయ్యారు. 2014 తరువాత దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో చేరారు. నెహ్రూ మరణం తర్వాత అవినాష్కు చంద్రబాబు అండగా నిలిచారు. అతనిని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మాటను అవినాష్ కాదనలేడనే టాక్ వినిపిస్తోంది. ఈ ధైర్యంతోనే చంద్రబాబు.. రాధాకృష్ణను పార్టీలో చేర్చుకునే సాహసం చేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇంతకీ రాధా టీడీపీలో చేరుతాడా..? ఒకవేళ చేరితే దేవినేని అవినాష్తో కలిసి పని చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.