అదే తొందర పాటు.!అదే తడబాటు.!అధ్యక్షుడైనా అవగాహనేది.? ఏపి బీజేపీ పయనం ఎటువైపు.?
అమరావతి/హైదరాబాద్ : నోరు ఉన్నోడికే ఊరప్పజెప్పాలనే సామెత చాలా ప్రసిద్దిచెందింది. అందుకు తగ్గట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయడం, గ్రామ స్థాయినుండి సంస్ధాగతంగా పటిష్టం చేయడంకోసం పార్టీ అధినేతలు శ్రమిస్తుంటారు. అంతే కాకుండా పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలను దూరం చేసి నేతల మద్య ఐక్యత తీసుకొచ్చి పార్టీని సమతూకంగా నడుపుతూ ఎదురులేని శక్తిగా తీర్చి దిద్దడమే పార్టీ అధినేత లక్ష్యంగా ఉంటుంది. కాని సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ఏపి బీజేపి అద్యక్షపదవిలో మార్పులు చేసినప్పటికి నూతన అద్యక్షుడి విధానాలతో పార్టీ పురోగమిస్తుందా..? తిరోగమిస్తుందా..?అన్నదే ప్రశ్నర్దకంగా మారింది.
తీరుమారని ఏపి బీజేపి అధ్యక్షుడు.. ప్రతిజిల్లాను క్యాపిటల్ చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఏపి బీజేపిలో క్షేత్ర స్థాయిలో మార్పులు చేసపట్టిన బీజేపి రానున్న రోజుల్లో అధికారమబే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం మంచి వాగ్థాటి ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించింది బీజేపి అధిష్టానం. సంచలన వ్యాఖ్యలు చేయడం,వెనుకా ముందు చూసుకోకుండా పొంతన లేకుండా మాట్లాడటం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నైజం. కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో సోముకు బీజేపీ అధినాయకత్వం ఏపీ అధ్యక్ష పదవిని అప్పజెప్పటం చాలా రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగించింది. అయితే రాష్ట్ర అద్యక్ష్య పదవి చేపట్టినా సోము వీర్రాజు మాటతీరులో మార్పు రాలేదనే చర్చ జరుగుతోంది.
ఏపి కొత్తగా అధ్యక్ష బాద్యతలు చేపట్టిన వీర్రాజు.. సంయమనం పాటించకపోతే ఇబ్బందులే..
తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బాగా పాపులర్ గా మారుతోంది. ఇప్పటికే రాజధాని కోసం ఏపీ ప్రజలు సంధిగ్దంలో కొట్టు మిట్టాడుతున్న వేళ సోము వీర్రాజు మరింత క్లిష్టమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీ రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా మారుస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం, అందుకు గవర్నర్ ఆమోదముద్ర వేయటం చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం తమ పొలాల్ని ఇచ్చిన వారంతా ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు షాకిస్తూ, మూడు రాజధానుల నిర్ణయంపై స్టే కూడా ఇచ్చింది.
కావాల్సింది దూకుడు కాదు దూరపు ఆలోచన.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఏపిలో జరుగుతున్న చర్చ..
ఇలా రాజధాని రగడ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో సోము వీర్రాజు ఒక చానల్ లోని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేయడం ఏపి బీజేపి నేతలకు విస్మయాన్ని కలిగించింది. 'రాజధాని అంశాన్ని మేం ఎందుకు పరిష్కరించలేం. మాకు పవర్ ఇప్పించేయండి. మాకు పవర్ ఇప్పించేస్తే, చంద్రబాబు నాయుడిలా చేయకుండా, ప్రస్తుత సీఎం లా కూడా చేయకుండా ఏపినీ అభివృద్ది దిశలో పరుగులు పెట్టిస్తాం, ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం, ప్రజల్ని విడగొట్టే పని చేయం. సమైక్యంగా చేస్తాం. అద్భుతంగా చేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని జిల్లాల్లో క్యాపిటల్ గా మార్చిపారేస్తాం. ప్రతి జిల్లా క్యాపిటల్ గా చేసి పారేస్తాం. అప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు' అంటూ పొంతన లేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలతో, మీడియాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తలు అవసరం.. నియంత్రణ కోల్పోతే ఎంతటి వారికైనా ఇబ్బందులే...
సమగ్ర పరిపాలన కోసం ఒక రాజధాని సరిపోతుందని కొందరు వాదిస్తుంటే కాదు మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని మరికొందరు వాదించుకుంటున్న తరుణంలో, ప్రతి జిల్లాను ఒక రాజధానిగా చేసేస్తామంటూ వీర్రాజు మీడియాలో మాట్లడడం విస్మయానికి గురిచేసింది. ఏపి బీజేపి అధ్యక్ష స్థానంలో ఉంటూ ఇలా పొంతన లేకుడా, అవగాహనా రాహిత్యంగా, బాద్యతా రాహిత్యంగా మాట్లాడటం పట్ల ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా బీజేపి శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతోంది.ఏపీ బీజేపిలో నంబర్ వన్ స్థానంలో ఉన్న సోము వీర్రాజు సంయమనంతో మాట్లడకపోతే పార్టీ ఎలా బలోపేతం అవుతుందనే చర్చ కూడా జరుగుతోంది.