తొలివికెట్ : టీడీపీకి క్రైస్తవ ఎమ్మెల్యే రాజీనామా-చంద్రబాబే కారణం-మత రాజకీయాలు తగదంటూ...!
విజయవాడ: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. విమర్శలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థంను సందర్శించి అక్కడ ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు తొలిసారిగా జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అంతేకాదు క్రైస్తవులపై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మతాలపై చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ చేస్తున్న మత రాజకీయాలు నచ్చడం లేదని పేర్కొంటూ ఆ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులైన ఫిలిప్ తోచర్ టీడీపీకి రాజీనామా చేశారు.
టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఎంతో అభిమానంతో కొనసాగుతున్నానని కానీ ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలతో తాని విసుగెత్తిపోయినట్లు తోచర్ చెప్పారు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో తాను చాలా బాధపడినట్లు ఆవేదనకు గురైనట్లు తోచర్ చెప్పారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయని అదే సమయంలో ఎవరి కులం, ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయని గుర్తుచేసిన తోచర్ ... తాను భారతదేశంలోని క్రిస్టియన్ అసోసియేషన్లో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడలో సిలువ వేసుకుని బైబిల్ చేతపట్టి ఆ గ్రంథాన్ని చదివినట్లు చెప్పారు తోచర్. అప్పుడు అంతేకాదు బైబిల్ చేత పట్టుకుని తన జన్మ ధన్యమైందని ఏసుక్రీస్తు శాంతిని బోధించాడని చంద్రబాబు చెప్పిన మాటలను తోచర్ గుర్తు చేశారు. మరి ఈ రోజు అందుకు విరుద్ధంగా మాట్లాడటం తనకు నచ్చలేదని, కేవలం మతంను ముందుకు పెట్టి రాజకీయం చేయడం తగదని చెప్పారు. క్రిస్టియానిటీ గురించి ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి అలా మాట్లాడటాన్ని చూసి ఇంతకాలం ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేసినందుకు బాధగా ఉందని తోచర్ లేఖలో పేర్కొన్నారు. ఇక ఏమతంపై నైనా సరే దాడులు జరిగితే వాటిని ఖండించాల్సిందేనని చెప్పుకొచ్చిన తోచర్... ఒకమతంను కాపాడేందుకు మరో మతంను దూషించడం పార్టీకి పార్టీ నాయకులకు మంచిది కాదని చెబుతూ అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.