YS Jagan: జగన్ ఫొటోపై నల్లరంగు: పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు.. !
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో చెలరేగిన ప్రకంపనల తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను మరింత పెంచుతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు 20 రోజులుగా తమ నిరసనలను పలు రకాలుగా ప్రదర్శిస్తూ వచ్చారు.
అయినప్పటికీ- ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. దీనితో రైతుల్లో అసహనం, ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై దాడులకు పాల్పడే దిశగా రైతులు అడుగులు వేసే పరిస్థితి తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ జగన్ చిత్రపటానికి నల్లరంగును పులిమిన ఉదంతం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసరాపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసరాపల్లి గ్రామ సచివాలయం భవనానికి అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటాన్ని ముద్రించారు. దీనిపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగును పులిమారు. రెండురోజుల కిందటి వరకూ సాధారణంగా కనిపించిన ఈ ఫ్లెక్సీపై సోమవారం ఉదయం నాటికి నల్లరంగు కనిపించింది. ప్రత్యేకించి- జగన్ చిత్రపటంపైనే నల్లరంగును పోశారు.
ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ పనికి పూనుకుని ఉంటారని ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ చిత్రపటానికి నల్లరంగు పులిమిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందతులను గుర్తించే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్పారు.