కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!
అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా లేకుండా అదృశ్యమయ్యారు. ఆయన కోసం ఇప్పటికీ కొందరు ఆరా తీస్తుండటం విశేషం. లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడా ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు జరిగిన మే 23వ తేదీ నుంచి ఆయన కన్పించడం మానేశారు.
మే 22వ తేదీన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరగడం మానేశారు. లగడపాటి రాజగోపాల్ ఏది చేసినా సంచలనమే. మొదట తెలంగాణ రాష్ట్రంలో జిరిగిన ఎన్నికల్లో ముందుస్తు సర్వే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుస్తుందని లెక్కలు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రసమితి ఆ ఎన్నికల్లో గెలిచింది. అయితే తన లెక్కలు తప్పు కావడానికి అనేక కారణాలున్నాయని, అవి మే 23వ తేదీ తర్వాత బయటపెడతానని చెప్పుకొచ్చారు.
అనేక చోట్ల ఓట్లు తొలగించడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమిపాలయిందని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయి కారణాలను మే 23వ తేదీ తర్వాత చెబుతానని తెలిపారు.ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చే సరికి లగడపాటి రాజగోపాల్ మరోసారి ప్రత్యక్ష మయ్యారు. మే 21వ తేదీన ఆయన అమరావతిలోనే మీడియా సమావేశం పెట్టి తెలంగాణలో కారు, ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ ఎక్కేందుకు ప్రజలు ఇష్టపడ్డారని పరోక్షంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు.
మే 22వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ టీడీపీ అత్యధికంగా వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ శాసనసభలోకి అడుగుపెడతారని తెలిపారు. అయితే తీరా ఫలితాలు చూస్తే పూర్తిగా రివర్స్ లో రావడంతో లగడపాటి రాజగోపాల్ అక్కడి నుంచి జంప్ అయ్యారు. ముఖ్యంగా లగడపాటి మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బెట్టింగ్ లు పెట్టారు. ఇళ్లు, విలువైన పొలాలను కూడా కొందరు కోల్పోయారు.
ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ పై ఏపీలో కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. అయితే ఆయన ఢిల్లీలోనే ఉండి తన వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.