కిషన్ రెడ్డిని కలిసా..!తప్పేంటి.! నాయకుడన్న తర్వాత కాస్త 'కమలం పోషణ' ఉండాలంటున్న వంశీ..!!
విజయవాడ/హైదరాబాద్ : అవును వల్లభనేని వంశీ ఎట్టకేలకు పెదవి విప్పారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే అన్నారు. అంతే కాకుండా ఎంపీ సుజనాచౌదరితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయని టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతగా ఎన్నో సినిమా కథలు తాను విన్నానని.. ఇప్పుడు తనపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథలు అల్లడం విడ్డూరంగా ఉందని వంశీ వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకే గన్నవరం నియోజకవర్గంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తేలేదని, తాను టీడిపిలోనే కొనసాగుతానని వంశీ స్పష్టం చేసారు.
అవును కిషన్ రెడ్డిని కలిసా..! తప్పేంటని ప్రశ్నిస్తున్న వల్లభనేని వంశీ..!!
ఒక అమిత్షా.. ఒక కిషన్ రెడ్డి.. ఒక రాం మాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కమలనాథులు చాలా మంది ఏపీపై కన్నేశారు. ఇలా అనేకంటే చంద్రబాబు నాయుడుని ఏకాకి చేసేందుకు రంగం సిద్దం చేసారని చెప్పొచ్చు. దానిలో భాగమే నలుగురు రాజ్యసభ సభ్యులు, టీడీపీలో సుజన అండ్ బ్యాచ్ను నయానో.. భయానో కాషాయ గూటికిలోకి లాగారు. నీకింత.. నాకింత అన్నట్టుగా ప్యాకేజీల పంచాయతీలు ఏమున్నాయనేది ఇక్కడ అప్రస్తుతం. అయితే.. బయటికి మాత్రం సేమ్ డైలాగ్ రాష్ట్ర ప్రయోజనాలంటూ జనానికి భ్రమలు కలిగించి మాయమైతున్నారు టీడిపి ముఖ్య నేతలు. తాజాగా వల్లభనేని వంశీ ఎపిసోడ్ అంతకు మించి ఉత్కంఠను కలిగిస్తోంది.
టీడిపి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు..! వైసీపి టీడిపి మద్య నెలకొన్న పంపకాల పోటీ..!!
టీడిపిలో మిగిలిన 23 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది తమతో టచ్లో ఉన్నారంటూ జగన్ బాహాటంగానే చెప్పేశారు. ఇప్పుడు మాతో కూడా పది మంది ఉన్నారంటూ ఇప్పుడు బీజేపీ కూడా అదే పల్లవి అందుకుంది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగమే.. టీడీపీతో అంటీ అంటనట్టు ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో బీజేపి టచ్లోకి వెళ్లటం సంచలనంగా మారింది. అయితే.. స్వర్ణభారతి ట్రస్టు అవార్డుల కోసమే తాను బీజేపి కిషన్ రెడ్డి తో భేటీ అయ్యానని వంశీ చెప్పుకొస్తున్నారు. అయినప్పటికి ఏదోమూలన వంశీ పార్టీ మారటం ఖాయమనేది మాత్రం స్పష్టమవుతోంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కమ్మ వర్గానికి కీలక స్థానం ఉంది. వైసీపీ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పదేళ్ల క్రితం ఉన్న సమన్వయకర్తలను మార్చేసి.. కొత్త ముఖాలైనా.. కమ్మ, బీసీ నేతలకు పోటీ అవకాశం కల్పించింది.
నేనెక్కడికి వెళ్లను..!టీడిపితోనే ఉంటా.. తేల్చి చెప్పిన వంశీ..!!
కులం ప్రభావం తారా స్థాయిలో చూపే కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి బయటకు వస్తే భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకో గలడా..? అనే సందేహం కూడా ఉంది. వైసీపీ పరిపాలనతో జనాన్ని ఆకర్షించగలిగితే 2024కు కూడా వైసీపీకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ మాత్రం కృష్ణాలో వల్లభనేని వంశీను తెరమీదకు తీసుకువచ్చి తద్వారా లబ్దిపొందాలనే ఎత్తుగడ వేస్తోంది. అయితే ఏపీ ప్రత్యేకహోదా అంశం బీజేపీపై వ్యతిరేకతను పెంచింది. మొన్నటి బడ్జెట్లో కూడా ఏపీకు నిధులు కేటాయించకపోవటం కూడా వ్యతిరేకతను మరింతగా పెంచింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమైన వల్లభనేని వంశీతో బీజేపీ ఎంత లాభపడుతుందనేది కూడా మరో మిలియన్ డాలర్ల ప్రశ్నే..!!
సందెట్లో సడేమియా..! చల్లగా బీజేపిలోకి జారుకున్న ఈదర హరి బాబు..!!
ఇదిలా ఉండగా టీడీపీకి సీనియర్ నేత, ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేసి, తన తనయుడితో కలిసి ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. ఈదరకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈదర హరిబాబుకు ఎంపీ సుజనా చౌదరితో పరిచయాలు కూడా ఉన్నాయి. సుజనా ఈదరతో చర్చలు జరిపి.. బీజేపీలో చేరేందుకు ఒప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈదర కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరతారని చర్చ నడుస్తోంది.