చంద్రబాబుపై వంశీ ఫైర్: వైసీపీకి మద్దతుగా నిలుస్తాం..జూ ఎన్టీఆర్ ఏమయ్యారు: చినబాబు...పవన్ పై ఇలా..!
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తాను వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని.. సీఎం జగన్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేసారు. టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానని గుర్తు చేసారు. వర్దంతికి..జయంతికి తేడా తెలియని వ్యక్తి నన్ను కించపరిచేలా వార్తలు రాయించారని..మెంటల్ కనెక్టవిటీ దెబ్బ తీసారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతిస్తానని తేల్చి చెప్పారు. అవసరమైతే రాజీనామా చేస్తానని వివరించారు. చంద్రబాబు ఏపీలోనూ టీడీపీని తెలంగాణ తరహాలోనే చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఉండి.. వైసీపీకి మద్దతు ఇవ్వకూడదు..ఇస్తానని..ఏం జరిగినా ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి.. పార్టీ కోసం పని చేస్తే..ఆయన ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు పుత్రరత్నం..సలహాదారులు పార్టీని ముంచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికారికంగా త్వరలో వైసీపీలో చేరుతానని వంశీ ప్రకటించారు.
వైసీపీకి మద్దతుగా ఉంటా..జగన్ తో కలిసి నడుస్తా
వల్లభనేని వంశీ తన విధానం స్పష్టం చేసారు. టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని తేల్చారు. తాను ఇప్పటికే పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తించారు. తాను జగన్ చేస్తున్న డెవలప్ మెంట్ ను చూసి..వైసీపీ ప్రభుత్వానికి..జగన్ కు మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేసారు. తాను ముఖ్యమంత్రిని కలిసినప్పడు ఆయన ఇచ్చిన హామీ మేరకు కలిసి నడవాలని నిర్ణయించానన్నారు. అదే విధంగా తాను టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉండకూడదని..దీని కారణంగా చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకున్నా..తాను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నానని తేల్చి చెప్పారు. కేసులు కొత్త కాదని.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ కేసులు పెట్టారని..వాటి కోసం తాను వైసీపికి మద్దతు ఇవ్వటం లేదని చెప్పారు. పరిటాల రవి ఉన్న సమయం నుండి తనకు జగన్ తెలుసన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో టీడీపీ నేతల సమస్యలు ఉంటే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించానని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా వైసీపీలో చేరుతానని ప్రకటించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరమయ్యారు..
2009 ఎన్నికల్లో తన కెరీర్ ఫణంగా పెట్టి టీడీపీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని వంశీ ప్రశ్నించారు. ఆయన్ను ఎవరు ఆపారని నిలదీసారు. చినబాబు.. ఉమా.. బంగీ జంప్ లు చేసిన వారు తనకు వ్యతిరేకంగా పని చేసారంటూ విమర్శించారు. వర్దంతి..జయంతికి తేడా తెలియని వాళ్లు తన కేరెక్టర్ అసాసినేట్ చేస్తే..తాను భరించాలా అని ఉద్వేగానికి గురయ్యారు. లోకేశ్ ను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకోలేక పోయారని ప్రశ్నించారు. టీడీపీ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని.. అలాంటి పార్టీ 2014లో జనసేన..బీజేపీతో పొత్తు పెట్టుకొని మూడేళ్ల తరువాత విడిపోయారని..సుజనా చౌదరి లాంటి వాళ్లు ధర్మపోరాట దీక్షలు వద్దని చెప్పినా వినలేదని గుర్తు చేసారు. టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. అన్నా దమ్ముళ్లు వేర్వేరు పార్టీలో ఉండేవారు..వియ్యంకులు వేర్వేరు పార్టీలో ఉండే వారు చంద్రబాబును డ్రైవ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒంటరిగా గెలిచే బలం టీడీపీకి ఎందుకు లేకుండా పోయిందని వంశీ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడకు వెళ్లలేదు..
పవన్ కళ్యాన్ ను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వెళ్లి కలిస్తే తాను సీఎంతో మాట్లాడుతానని చెప్పారు కానీ, ఎందుకు వెళ్లలేదని వంశీ ప్రశ్నించారు. అదే పవన్ ఏపీలో ప్రశ్నిస్తారు. అక్కడ ఒక విధంగా..ఒక్కడ మరో విధంగా ఒకే వ్యక్తి వ్యవహరిస్తున్నారని పవన్ పైన ఫైర్ అయ్యారు. ఇది..లాలూచీ కాదా అని ప్రశ్నించారు. ఇక, ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలల్లోగానే చంద్రబాబు దీక్షలు..ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీసారు. చంద్రబాబు కూడా అక్కడ ఆర్టీసి కార్మికులకు ఎందుకు మద్దతివ్వటం లేదంటూ..ఓటు కు నోటు కేసు భయపెడుతుందా అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తప్పు కాదన్నారు. ఇసుక సమస్య పరిష్కారం ఆలస్యం అవుతుందని..టీడీపీ ప్రభుత్వంలో రైతు రుణ మాఫీ ఎంత సమయం తీసుకున్నారని నిలదీసారు. బంగీ జంప్ చేసిన వారు సైతం వైసీపీలోకి రావటానికి ప్రయత్నించారని..అయితే ఖాళీ లేక ఆగిపోయారని చెప్పుకొచ్చారు.