వంశీతో సహా ఆ ముగ్గురు..సభలో కొత్త పాత్ర ! అసెంబ్లీ సమావేశాల వేదికగా : టీడీపీ రివర్స్ ప్లాన్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తొలుత డిసెంబర్ 2 నుండి సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేసినా..ఇప్పుడు 9వ తేదీ నుండి నిర్వహించాలని భావిస్తోంది. ఏపీలో రోజురోజుకీ వేడి పుట్టిస్తున్న రాజకీయాలతో ప్రభుత్వం..అసెంబ్లీ వేదికగానే అన్నింటికీ సమాధానం చెప్పాలని భావిస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాల్లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులతో ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. వల్లభనేని వంశీని ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేయటంతో ఆయన అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేనే అయినా ..సాంకేతికంగా స్వతంత్ర అభ్యర్దిగా సభలో ఉండనున్నారు. విశాఖకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం సమావేశాలు ప్రారంభమయ్యే లోగానే తమ విధానం ప్రకటిస్తారని సమాచారం. దీంతో..ఇప్పుడు అధికార పార్టీ వ్యూహానికి ప్రతిగా టీడీపీ రివర్స్ ప్లాన్ సిద్దం చేస్తోంది.
వంశీ రాజీనామాపై సీఎం తేల్చేసారు: వెంకటరావుకు జగన్ ఇచ్చిన హామీ అదే : అసెంబ్లీలో ఆయన ఇలాగే..!
డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్న సమయంలో..వీటన్నింటికీ శాసనసభా వేదికగానే సమాధానం చెప్పాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా వైసీపీ ఎల్పీ కీలక నేతల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంగ్లీషు మీడియా పాఠశాలలు..ఇసుక అంశం.. మత పరమైన వ్యవహారాల పైన అధికార పార్టీ నుండే చర్చకు ప్రతిపాదించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఫిరాయింపుల అంశం పైన చర్చించి.. తమ వైఖరి మరోసారి సభ ద్వారా స్పష్టం చేయాలని నిర్ణయించారు. గతంలో నిర్ణయం మేరకు పార్టీలో చేరికల విషయంలో తమ వైఖరి ఉంటుందని సభా వేదికగా స్పష్టత ఇచ్చేందుకు అధికార పార్టీ సమాయత్తం అవుతోంది.
అసెంబ్లీలో వంశీ ఎటువైపు..!
గన్నవరం వల్లభనేని వంశీ టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. కానీ, ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు. శాసనసభలో మాత్రం పార్టీ సస్పెండ్ చేయటంతో ఆయన్ను స్వతంత్ర అభ్యర్ధిగా పరిగణించనున్నారు. ఆ సమయంలో వంశీ ద్వారానే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లీషు మీడియం విధానం..ఇసుక పాలసీ..మధ్యం విధానం మీద మాట్లాడించాలని అధికార పార్టీ భావిస్తోంది. సభలో స్వతంత్ర అభ్యర్ధి గా సమావేశాల వరకు పరిగణించనుండటంతో..వంశీ ద్వారానే ప్రభుత్వ విధానాలను మద్దతుగా సభా వేదికగా మాట్లాడించే అవకాశం ఇవ్వటం ద్వారా టీడీపీ ఇరుకున పడుతోందని వైసీపీ అంచనా వేస్తోంది.
Recommended Video
వంశీతో సహా మరో ముగ్గురు..!
ప్రస్తుతం వంశీ టీడీపీ నుండి సస్పెండ్ అయ్యారు. ఇదే విధంగా టీడీపీ నుండి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేయటం లేదు. అయితే, వారు వైసీపీలో కాకుండా..బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో..వారు ఈ సమావేశాలకు హాజరవుతారా..హాజరైనా టీడీపీ బెంచ్ ల్లో కూర్చుంటారా అనే చర్చ సాగుతోంది. తాజా సమాచారం మేరకు వారు తాము పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటించానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్యే పదవులకు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వారి పైన టీడీపీ ఇదే రకంగా సస్పెన్షన్ వేటు వేస్తుందా లేదా అనేది మరో చర్చ. సస్పెన్షన్ వేటు వేస్తే వారు వంశీతో కలిసి సభలో స్వతంత్ర అభ్యర్ధులుగా సభకు హాజరై..తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. దీని పైన ఆ ముగ్గురు ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం
టీడీపీ రివర్స్ ప్లాన్
గెలిచిన పార్టీ పైనే తిరుగుబాటు చేసి..పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేల పైన టీడీపీ ఫోకస్ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ సభలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చినా.. టీడీపీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగానే..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాల్లో ముందుగానే పార్టీ సభ్యులందరికీ విప్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. పార్టీ సస్పెండ్ చేసినా..ఎమ్మెల్యేలు కొనసాగుతున్న వారికి విప్ వర్తిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా రెబల్స్ విప్ ధిక్కరిస్తే వారి పైన అనర్హత వేటు సిఫార్సుకు సభలోనే సాక్షిగా నిలుస్తుందని వివరిస్తున్నారు. దీంతో..ఈ సారి జరిగే సమావేశాలు టీడీపీ..వైసీపీకి ఇద్దరి రాజకీయ వ్యూహాల సమర్ధతకు పరీక్షగా మారనున్నాయి.