జూ. ఎన్టీఆర్ వర్సెస్ లోకేశ్: పార్టీలో చర్చ..రచ్చ : పవన్ కావాలి.. జూనియర్ వద్దా..!
Recommended Video
జూనియర్ ఎన్టీఆర్..ప్రస్తుం రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. కానీ, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మత్రం ఆయన పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇది టీడీపీలో కొత్త చర్చ కు కారణమైంది. అయితే, మాజీ మంత్రి లోకేశ్ మాత్రం 2009లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా 2009 ఎన్నికల వరకే పార్టీతో జూనియర్ కు సంబంధం అని చెప్పదలచుకున్నారా అనే చర్చ నడుస్తోంది. లోకేశ్ కంటే జూనియర్ వంద రెట్టు బెటర్ అంటూ వంశీ..కొడాలి నాని వంటి వారు విమర్శిస్తున్నారు. దీని ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పుడు..జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి పూర్వ వైభవం తేగలని ఎన్నికల్లో ఓటమి నుండి చర్చ మొదలైంది. అయితే, అందుకు జూనియర్ సిద్దంగా ఉన్నారా. పవన్ కళ్యాన్ మద్దతు కోరుకుంటున్న టీడీపీ..జూనియర్ మాత్రం వద్దనుకుంటుందా..
చంద్రబాబుపై వంశీ ఫైర్: వైసీపీకి మద్దతుగా నిలుస్తాం..జూ ఎన్టీఆర్ ఏమయ్యారు: చినబాబు...పవన్ పై ఇలా..!
2009 లో ఉప్పెనలా వచ్చిన జూనియర్..
2009 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. శ్రీకాకుళం నుండి ఖమ్మం వరకూ జూనియర్ చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రచారంలో ఉండగానే ఖమ్మం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూనే..టీవీల ద్వారా ప్రజలను టీడీపీకి ఓట్లు వేయమని అభ్యర్ధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఒక వైపు అధికారంలో ఉన్న వైయస్సార్.. మరో వైపు ప్రజారాజ్యం కోసం మెగా బ్రదర్స్..ఇలా వీరిని ఎదుర్కోవటానికి టీడీపీ ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడింది. జూనియర్ ప్రభావం చూపించగలిగారు. కానీ, ప్రమాదం కారణంగా ప్రచారానికి దూరమయ్యారు. ఆ తరువాత పార్టీలో జరిగిన పరిణామాలతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగానే ఉంటున్నారు.
లోకేశ్ కోసమే జూనియర్ ను పక్కన పెట్టారంటూ..!
ఇక, లోకేశ్ పార్టీలో రంగ ప్రవేశం తరువాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దాదాపు దూరమయ్యారు. జూనియర్ తండ్రి హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం బలంగా వినిపించింది. అయితే, 2009 తరువాత జూనియర్ ప్రధానంగా సినిమాల మీదనే ఫోకస్ అయ్యారు. లోకేశ్ ప్రాధన్యత పార్టీలో పెరిగిన తరువాత ఇక..జూనియర్ గురించి ఎవరూ ప్రస్తావన కూడా తీసుకురావటం మానేసారనే చర్చ అనేక సార్లు జరిగింది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాన్..బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ..ఆ సమయంలో బాలకృష్ణ ను హందూపూర్ నుండి రంగంలోకి దింపి నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలకు ఆస్కారం లేకుండా చేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా..జూనియర్ మాత్రం పార్టీ వ్యవహారాలకు తిరిగి దగ్గర కాలేదు. అదే సమయంలో లోకేశ్ పార్టీలో చంద్రబాబుతో తరువాతి స్థానంలో నిలుస్తూ వచ్చారు.
పవన్ కావాలి..జూనియర్ వద్దా..
2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు లాంటి వ్యక్తి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మద్దతు కోరిన విషయాన్ని ఇప్పుడు వంశీ లాంటి వారు గుర్తు చేస్తున్నారు. జూనియర్ కు తొలి నుండి సన్నిహితంగా ఉన్న కొడాలి నాని వంటి వారు సైతం జూనియర్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా పవన్ మద్దతు కోసం ప్రయత్నిస్తన్నారు కానీ, జూనియర్ ను ఎందుకు కలుపుకుపోరనే ప్రశ్న వంశీ ద్వారా వైసీపీ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది. దీని ద్వారా నందమూరి అభిమానుల్లోనూ.. ఎన్టీఆర్ కుటుంబంలోనూ కొత్త చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో పవన్ సైతం పూర్తిగా టీడీపీకి మద్దతిచ్చే పరిస్థితుల్లో లేరు. పవన్..జూనియర్ ప్రస్తావన వ్యూహాత్మకంగానే సాగుతోంది. అయితే, లోకేశ్ మాత్రం 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అని వ్యాఖ్యానించటం కొత్త చర్చకు కారణమైంది.
జూనియర్ సిద్దంగా ఉన్నారా..
ఇప్పుడు టీడీపీని వ్యతిరేకించే వారు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే, అసలు జూనియర్ నిజంగా చంద్రబాబు ఆహ్వానించినా పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించటానికి సిద్దంగా ఉన్నారా అనే చర్చ సాగుతోంది. తన సోదరి సుహాసిని ని తెలంగాణ ఎన్నికల సమయంలో కుకట్ పల్లి నుండి టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిచినా..జూనియర్ మద్దతుగా ప్రచారం చేయలేదు. కేవలం మద్దతుగా ప్రకటన మాత్రం విడుదల చేసారు. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పు వస్తే చెప్పలేం కానీ..ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కాదని.. రాజకీయాల్లో తిరిగి ప్రవేశించే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే, లోకేశ్ ను డామేజ్ చేసేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు.